ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. ఇండియా కూటమి చీఫ్‌గా మమతా బెనర్జీ, పార్టీల్లో గందరగోళం

national |  Suryaa Desk  | Published : Sat, Dec 07, 2024, 08:25 PM

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు గతేడాది ఏర్పడిన ఇండియా కూటమికి ఆది నుంచి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అయితే ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ సీట్లు రాకుండా, సొంతంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా చేయడంలో ఇండియా కూటమి సక్సెస్ అయింది. అదే సమయంలో మరిన్ని సీట్లు సాధిస్తే అధికారాన్ని దక్కించుకునే వరకు కూడా వెళ్లింది. అయితే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కలిసికట్టుగా పోరాడలేదని.. ఐక్యంగా పోరాడితే ఈ ఎన్నికల్లో కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉండేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఇండియా కూటమిలో ఉన్న లుకలుకలు కాస్తా.. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునే వరకు వెళ్లాయి. ఇక మెజార్టీ పార్టీలు కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నాయి.


ఇండియా కూటమికి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వం వహించడంపై పార్టీల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఎదిరించే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదని.. అది టీఎంసీ వల్లే సాధ్యం అని మమతా బెనర్జీకి మద్దతు పలికే పార్టీలు, నేతలు చెబుతున్నారు. అందుకే ఇండియా కూటమి చీఫ్‌గా దీదీ పేరును ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


ఇక ఇండియా కూటమికి తాను సమర్థవంతంగా నాయకత్వం వహిస్తానని స్వయంగా మమతా బెనర్జీ ప్రకటించడంతో ఇండియా కూటమిలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మమతా బెనర్జీకి ఇండియా కూటమి చీఫ్ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్లపై కాంగ్రెస్‌ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇక సమాజ్‌వాదీ పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీలు దీదీకి మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఇండియా కూటమిలో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. మమతా బెనర్జీకి కూటమి బాధ్యతలు అప్పగించేందుకు తాము పూర్తిగా మద్దతు తెలుపుతున్ననట్లు సమాజ్‌వాదీ పార్టీ నేషనల్ ప్రతినిధి ఉదయ్‌వీర్‌ సింగ్ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి టీఎంసీ గట్టి పోటీని ఇస్తోందని.. కమలం పార్టీని నిలువరించడంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా పని చేస్తోందని పేర్కొన్నారు.


ఇక ఇటీవల హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఇండియా కూటమికి ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఈ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలకు బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీదేననే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు.. ఇండియా కూటమికి బీహార్‌ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సరైన లీడర్ అవుతారని ఆ పార్టీ పేర్కొంది.


ఇక కాంగ్రెస్‌ పార్టీ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని.. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కూటమి భాగస్వాములకు చోటు కల్పించలేదని సీపీఐ జనరల్ సెక్రటరీ డీ రాజా ఆరోపించారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ.. ఇండియా కూటమిలోని మిత్ర పక్షాల మాట విని ఉంటే ఎన్నికల ఫలితాలు వేరుగా ఉండేవని మండిపడ్డారు. మమతా బెనర్జీకి బాధ్యతలు అప్పగించడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మమతా బెనర్జీ చెప్పినట్లు ఆమె పార్టీ నడుస్తుందని.. అదే విధంగా తాము కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలనే పాటిస్తామంటూ హస్తం పార్టీ వెల్లడించింది. ఇక ఇండియా కూటమిలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రధాన భాగస్వామి కావాలని కోరుకుంటున్నట్లు


శివసేన ఉద్ధవ్ ఠాక్రే నేత సంజయ్‌ రౌత్ తెలిపారు. ఇండియా కూటమి చీఫ్‌గా దీదీ కానీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ గానీ, శివసేన పార్టీ నేత గానీ ఎవరు ఉన్నా తామంతా కలిసే ఉంటామని చెప్పారు. అంతేకాకుండా ఇదే విషయంపై మమతా బెనర్జీతో చర్చలు జరిపేందుకు త్వరలోనే కోల్‌కతా వెళ్తామని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa