ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓవైపు ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలు.. మద్దతు ధరపై పార్లమెంటులో కేంద్రమంత్రి ప్రకటన

national |  Suryaa Desk  | Published : Sat, Dec 07, 2024, 08:31 PM

దేశంలో పంటలకు మద్దతు ధర కోసం గత కొన్నేళ్లుగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. పంజాబ్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర సహా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన అన్నదాతలు సంఘాలుగా ఏర్పడి ఏళ్లకేళ్లు పోరాటం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకువచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఈ రైతు ఉద్యమం.. వాటిని రద్దు చేసినా ఆగడం లేదు. అయితే పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మరోసారి దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మద్దతు ధరపై రాజ్యసభలో శుక్రవారం అడిగిన ప్రశ్నకు.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు.


కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. రైతులు పండించే పంటను మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. రైతులు పండించే అన్ని పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మోదీ గ్యారంటీని కచ్చితంగా నెరవేరుస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు పంట ఉత్పత్తికి 50 శాతం పెట్టుబడి చెల్లించాలని ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులను ఒప్పుకోలేదని ఆయన మండిపడ్డారు.


2019 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రైతులకు ఉత్పత్తి ఖర్చుపై 50 శాతం ఇవ్వడం ద్వారా కనీస మద్దతు ధరను లెక్కించాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇప్పటికే రైతులకు లాభాలు అందిచేలా పంటలకు కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం చెల్లింస్తోందని చెప్పారు. వరి, గోధుమలు, జొన్నలు, సోయాబీన్‌లను 3 ఏళ్లుగా ఉత్పత్తి ధర కంటే 50 శాతం అధికంగా కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎంఎస్పీపై ఆలోచనలు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ అడగ్గా.. తమకు ఎంఎస్పీ గురించి స్పష్టమైన ఆలోచన ఉన్నట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఎంఎస్పీని 50 శాతం కంటే ఎక్కువ లాభంతో నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. రైతుల ఉత్పత్తులను కూడా కొనుగోలు చేస్తామని ఈ సందర్భంగా కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa