మన దేశంలో రైల్వేలకు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. బ్రిటీష్ కాలం నాటి నుంచి దేశంలో రైల్వే లైన్లు ఉన్నాయి. ఇక సరుకు రవాణాతోపాటు ప్రయాణికులను ఒకచోటు నుంచి మరొక చోటుకు తక్కువ ధరకు చేర్చేందుకు రైల్వేలు ఒక సాధనంగా ఉపయోగపడుతున్నాయి. ఈ క్రమంలోనే పొగబండ్లు, ఆవిరి ఇంజిన్ల దగ్గరి నుంచి ప్రారంభమైన భారతీయ రైల్వేల ప్రయాణం.. ఇప్పుడు వందే భారత్, వందే భారత్ స్లీపర్, వందే భారత్ మెట్రో, బుల్లెట్ రైలు, హైడ్రోజన్ రైలు లాంటి అత్యాధునిక రైళ్లు పరుగులు తీసేంత టెక్నాలజీకి అభివృద్ధి చెందింది. ఈ క్రమంలోనే ఇప్పుడు విమానం కంటే వేగంగా వెళ్లే హైపర్లూప్ రైలు పరుగులు పెట్టనుంది. దీని కోసం ఇప్పటికే రైల్వే ట్రాక్ను సిద్ధం చేశారు.
త్వరలోనే భారత్లో హైపర్లూప్ రైలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికోసం 410 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ను సిద్ధం చేశారు. దీనికి సంబంధించి.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. హైపర్లూప్ రైల్వే ట్రాక్ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఈ హైపర్లూప్ రైల్వే ట్రాక్ను రైల్వే శాఖ, ఐఐటీ మద్రాస్ కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
ఇక హైపర్లూప్ రైలు అత్యంత వేగవంతమైన రైలుగా పేరు గాంచింది. ఇది ట్యూబ్ వాక్యూమ్ ద్వారా ప్రయాణిస్తుంది. ఈ హైపర్లూప్ రైలులో మాగ్నటిక్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ ట్యూబ్ వాక్యూ్మ్లో గంటకు 1100 కిలోమీటర్ల నుంచి 1200 కిలోమీటర్ల వేగంతో హైపర్లూప్ రైలు నడుస్తుంది. భారతీయ రైల్వే అభివృద్ధి చేస్తున్న ఈ హైపర్లూప్ రైలు గరిష్ట వేగం గంటకు 600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. దీని వల్ల విద్యుత్ వినియోగంతోపాటు కాలుష్యం కూడా తగ్గుతుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఇక అతి వేగంతో ప్రయాణించడం వల్ల చాలా సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు. హైపర్లూప్ రైలు గంటకు 1100 కిలోమీటర్ల వేగంతో సులభంగా ప్రయాణించేలా రూపొందించనున్నారు. ఈ హైపర్లూప్ రైలు ఢిల్లీ-పాట్నా మధ్య దూరాన్ని ఒక గంటలో చేరుకోనుంది.
ఇక మన దేశంలోనే తొలి హైపర్లూప్ రైలు ముంబై-పూణే మధ్య నడపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ముంబై నుంచి పూణే మధ్య కేవలం 25 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ప్రస్తుతం రైలులో ఈ రెండు నగరాల మధ్య దూరాన్ని అధిగమించేందుకు 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. అయితే ఈ హైపర్లూప్ రైలు టికెట్ విమాన టికెట్ ధర లాగా కాకుండా తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హైపర్లూప్ రైళ్లు నాన్స్టాప్గా ప్రయాణించగలవు. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. అయితే ఈ హైపర్లూప్ రైళ్లకు మధ్యలో స్టాప్లు ఉండే అవకాశం లేదు. అయితే ఈ హైపర్లూప్ రైలు ఆలోచన కొత్తది కాదు. ఈ కాన్సెప్ట్ను 2013లోనే మొదట ఎలాన్ మస్క్ ప్రతిపాదించారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్, శాన్ఫ్రాన్సిస్కో నగరాల మధ్య త్వరిత నాన్స్టాప్ ప్రయాణం కోసం ఎలాన్ మస్క్ ఈ హైపర్లూప్ ఆలోచనను తీసుకువచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa