పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. తన తృణముల్ కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా నడిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత సొంతంగా పశ్చిమ బెంగాల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 1998లో ప్రారంభించిన టీఎంసీ.. బెంగాల్తోపాటు వివిధ రాష్ట్రాల్లో విస్తరించింది. అయితే ఏకఛత్రాదిపత్యంగా దీదీ.. అటు తృణముల్ కాంగ్రెస్ పార్టీని, పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె తర్వాత టీఎంసీ పగ్గాలు ఎవరు చేపడతారు అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికే తృణముల్ కాంగ్రెస్ పార్టీలో విబేధాలు రచ్చకెక్కాయి. ఈ క్రమంలోనే తాజాగా దీదీ స్పందించారు. తన తర్వాత టీఎంసీ అధినేత ఎవరు అనేది నిర్ణయించేంది తృణముల్ కాంగ్రెస్ పార్టీ, బెంగాల్ ప్రజలేనని తేల్చి చెప్పారు.
ప్రస్తుతం తృణముల్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు, యువ నేతల మధ్య విబేధాలు ఏర్పడగా.. ఈ పరిణామాల మధ్య టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తన వారసులు ఎవరనే దానిపై తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ నాయకత్వం కలిసికట్టుగా.. పార్టీ వారసులపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తమ పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని తేల్చి చెప్పారు. తాజాగా స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయన్ని వెల్లడించారు. తమ పార్టీలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ఉండవని చెప్పారు. తాను ఒక్కదాన్నే పార్టీ కాదని.. కార్యకర్తలం అందరం కలిస్తేనే పార్టీ అని తెలిపారు. టీఎంసీది ఒక కుటుంబం అని.. అన్ని నిర్ణయాలను కలిసికట్టుగానే తీసుకుంటామని తేల్చి స్పష్టం చేశారు.
అదే సమయంలో టీఎంసీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని.. ఇక్కడ ఏ ఒక్కరూ ఆదేశాలు జారీ చేయరని దీదీ చెప్పారు. ప్రజలకు ఏది మంచిదో అది పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు. తమకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు ఉన్నారని.. దేనిపైన అయినా కలిసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా టీఎంసీలో సీనియర్లు, జూనియర్ల మధ్య నెలకొన్న విభేదాలపైనా స్పందించిన దీదీ.. పార్టీకి ప్రతీ ఒక్కరూ ముఖ్యమే అని.. ఇవాళ కొత్తగా వచ్చిన వారు రేపు సీనియర్లు అవుతారని తెలిపారు. పార్టీలో ఉన్న సీనియర్లుగా ఉన్న వారు.. మమతా బెనర్జీతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. పార్టీకి సీనియర్లు, జూనియర్లు కావాలి అని ఆమె తేల్చి చెప్పారు. మరోవైపు.. టీఎంసీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీకి యువ నాయకులతో సత్సంబంధాలు ఉండగా.. ఈ రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa