ఇటీవలె తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించి ఫుల్టైం రాజకీయాల్లోకి వచ్చిన హీరో దళపతి విజయ్.. తన వ్యాఖ్యలు, ప్రసంగాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్.. కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 68వ జయంతి సందర్భంగా శుక్రవారం తమిళనాడు రాజధాని చెన్నైలోని నందంబాక్కం ట్రేడ్ సెంటర్లో జరిగిన "అంబేద్కర్ అందరికీ నాయకుడు" అనే పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ.. తమిళనాడులోని డీఎంకే సర్కార్లపై దళపతి విజయ్ నిప్పులు చెరిగారు.
మణిపూర్లో గత ఏడాదికి పైగా జరుగుతున్న తీవ్ర హింసాత్మక పరిస్థితులను ప్రస్తావించిన దళపతి విజయ్.. వాటిని అదుపు చేయడంలో కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్రంగా విఫలం అయిందని ఆరోపించారు. ఇవాళ మణిపూర్లో ఏం జరుగుతుందో తమకు తెలుసని విజయ్ తెలిపారు. అవేమీ పట్టించుకోకుండా దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ఎన్డీఏది అని ఎద్దేవా చేశారు.
మరోవైపు.. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీపైనా దళపతి విజయ్ విరుచుకుపడ్డారు. తమిళనాడులో దళితుల కోసం కేటాయించిన వాటర్ ట్యాంక్లో మానవ మలమూత్రాలను కలిపిన ఘటనపై ఎంకే స్టాలిన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇదంతా చూసి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఈరోజు బతికి ఉంటే సిగ్గుతో తల దించుకుని ఉండేవారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే రాజ్యాంగాన్ని పరిరక్షించాలని.. ఆ బాధ్యతను ప్రజలే తీసుకోవాలని విజయ్ పిలుపునిచ్చారు. తనకు ఒక సందేహం ఉందని.. అంబేద్కర్ ప్రస్తుతం జీవించి ఉంటే నేటి భారతదేశం గురించి ఏమని అనుకుని ఉండేవాడని దళపతి విజయ్ ప్రశ్నించారు.
ఇక ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలు కీలకమని దళపతి విజయ్ గుర్తు చేశారు. ఎన్నికల నిర్వహణకు బాధ్యత వహించే ఎన్నికల కమిషనర్లను ఏకాభిప్రాయంతో ఎన్నుకోవాలని తమిళగ వెట్రి కళగం పార్టీ చీఫ్ డిమాండ్ చేశారు. దేశంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికలు అన్యాయంగా జరిగాయని తాను అనడం లేదని పేర్కొన్నారు. కానీ ఇప్పటినుంచి జరిగే ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతున్నాయన్న నమ్మకం ప్రతీ ఒక్క భారతీయుడికి ఉండాలని ఆయన తెలిపారు. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే విజయ్ ప్రకటించారు. అందుకోసం ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోందని దళపతి విజయ్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa