ఎట్టకేలకు మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో కొనసాగిన సస్పెన్స్ ఇటీవలె వీడి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో మహాయుతి కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం నేడు అసెంబ్లీలో ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి మహా వికాస్ ఆఘాడీ కూటమి నేతలు దూరంగా ఉన్నారు. తాము ఇవాళ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడం లేదని ఉద్ధవ్ ఠాక్రే శివసేన నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే వెల్లడించారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని.. ఈవీఎంల ద్వారా మహాయుతి కూటమి విజయం సాధించిందని.. దాన్ని తాము అంగీకరించడం లేదని ఆదిత్య ఠాక్రే తెలిపారు.
మహారాష్ట్రలో జరగాల్సిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రతిపక్ష కూటమి ఎమ్మెల్యేలు బహిష్కరించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహా వికాస్ ఆఘాడీ కూటమిలో భాగంగా ఉన్న శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఎమ్మెల్యేలు నేడు మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం లేదని ఆదిత్య ఠాక్రే వెల్లడించారు. ఈవీఎంలపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. అందుకు నిరసనగా నేడు ప్రమాణ స్వీకారం చేయడం లేదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆదిత్య ఠాక్రే.. ఈ ఫలితాలపై మరాఠా ప్రజలు సంతృప్తి చెందలేదని అన్నారు. ఈవీఎంల విషయంలోనూ తప్పు జరిగిందని పేర్కొన్న ఆదిత్య ఠాక్రే.. ప్రజలు ఇచ్చిన తీర్పు అయితే వారంతా సంతోషంగా ఉండేవారని తెలిపారు. అలా జరగలేదు కాబట్టే ఎక్కడా విజయోత్సవాలు కనిపించడం లేదని ఆదిత్య ఠాక్రే ఎద్దేవా చేశారు.
ఇక ఆదిత్య ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ తీవ్ర ఆగ్రహం చేశారు. ప్రతిపక్ష కూటమి నేత చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి రుజువు లేదని మండిపడ్డారు. అవసరమైతే కోర్టును, ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని సూచించారు. ఈ సందర్భంగా ఇవాళ ఎమ్మెల్యేలుగా దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ సహా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. కాగా.. 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి 230 సీట్లను సొంతం చేసుకుంది. మహారాష్ట్రలో ప్రస్తుతం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మహారాష్ట్ర స్పీకర్ పదవి ఎవరికి అప్పగించనున్నారు అనే అంశంపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. మరో 2 రోజుల్లో కొత్త స్పీకర్ను ఎన్నుకోనుండగా.. అప్పటివరకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్.. ప్రొటెం స్పీకర్గా కాళిదాస్ కొలంబ్కర్ను నియమించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa