ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్తాన్‌లో తొలి హిందూ పోలీస్.. ఎవరీ ఏఎస్పీ రాజేందర్ మేఘ్వార్

international |  Suryaa Desk  | Published : Tue, Dec 10, 2024, 09:05 PM

దేశ విభజన జరిగిన తర్వాత మన దాయాది దేశం పాకిస్తాన్‌లో హిందువులపై, హిందూ ఆలయాలపై దశాబ్దాలుగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇక హిందువులు అక్కడి ప్రభుత్వంలో, ఇతర హోదాల్లో ఉండటం చాలా అరుదు. ఇక తాజాగా పాకిస్తాన్‌లో తొలిసారిగా సివిల్ సర్వీసెస్ పరీక్ష ఎక్సామినేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి.. పాకిస్తాన్ పోలీస్ సర్వీసెస్‌కు రాజేందర్ మేఘ్వార్ అనే హిందువు సెలెక్ట్ అయ్యారు. దీంతో తొలి హిందూ ఏఎస్పీగా రాజేందర్ మేఘ్వార్ చరిత్రలో నిలిచారు. ఇప్పుడు రాజేందర్ మేఘ్వార్.. పాకిస్తాన్‌లోనే కాకుండా భారత్‌లోనూ చర్చకు దారి తీశారు. పాకిస్తాన్‌లో మైనార్టీ సమస్యలు తీర్చేందుకు ప్రయత్నిస్తానని రాజేందర్ మేఘ్వార్ స్పష్టం చేశారు.


పాకిస్తాన్‌‌లోని పంజాబ్ ప్రావిన్స్‌ గుల్బర్గ్‌లోని ఫైసలాబాద్ పోలీస్‌లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా రాజేందర్ మేఘ్వార్ సెలెక్ట్ అయ్యారు. సింధ్‌ ప్రావిన్స్‌లోని బాడిన్ ప్రాంతానికి చెందిన రాజేందర్ మేఘ్వార్.. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత పాకిస్తాన్ పోలీస్ సర్వీస్‌లో ఏఎస్పీగా చేరారు. ఈ సందర్భంగా ఏఎస్పీగా ఎన్నికైన తర్వాత మాట్లాడిన రాజేందర్ మేఘ్వార్.. ప్రజలకు సేవ చేయాలనే తన కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పోలీస్ శాఖలో మైనారిటీలకు చేయాల్సిన పనిని ఇతర శాఖల్లో ఉంటే చేయలేనని చెప్పారు.


ఈ సందర్భంగా పోలీస్ శాఖలో పనిచేస్తే సమాజంలో అట్టడుగు స్థాయి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించగలమని రాజేందర్ మేఘ్వార్ స్పష్టం చేశారు. ఇలా మరే ఇతర శాఖల్లో చేయలేమని తెలిపారు. తన పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు మైనారిటీల సమస్యల పరిష్కారానికి రాజేందర్ మేఘ్వార్ సహకరిస్తారని.. పోలీస్ అధికారులు తెలిపారు. ఒక హిందూ పోలీస్ అధికారి ఉండటం గొప్ప విషయమని పేర్కొన్న ఉన్నతాధికారులు.. రాజేందర్ మేఘ్వార్ పోలీస్ శాఖలో చేరడం ఫైసలాబాద్‌లో చాలా అవసరం అని పేర్కొన్నారు. రాజేందర్ మేఘ్వార్ రాకతో.. మరికొంతమంది హిందువులు కూడా పోలీస్ సర్వీసుల్లో చేరే అవకాశం ఉంటుందని తెలిపారు.


ఇక రాజేందర్ మేఘ్వార్‌తోపాటు మైనారిటీ వర్గానికి చెందిన రూపమతి అనే మహిళ కూడా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో పాస్ అయ్యారు. రహీమ్ యార్ ఖాన్‌కు చెందిన రూపమతి.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో చేరనున్నట్లు తెలిపారు. తాను పాకిస్తాన్ అభివృద్ధి సూచికను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com