దేశ రాజధాని దిల్లీలో మరోసారి పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. పశ్చిమ విహార్లోని దిల్లీ పబ్లిక్ స్కూల్, కేంబ్రిడ్జ్ పాఠశాల సహా పలు విద్యాసంస్థలకు శుక్రవారం తెల్లవారుజామున బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి.అప్రమత్తమైన యాజమాన్యం వెంటనే దిల్లీ పోలీసులకు సమాచారమిచ్చింది.వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది, బాంబు నిర్వీర్య దళంతో అక్కడకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మెయిల్ ఐపీ అడ్రస్ ఎక్కడిదనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.కాగా.. దిల్లీలో ఇలా పాఠశాలలకు బెదిరింపులు రావడం వారంలో ఇది రెండోసారి కావడం గమనార్హం. నాలుగు రోజుల క్రితం అంటే డిసెంబరు 9న కూడా 40కి పైగా స్కూళ్లకు ఈ తరహా బెదిరింపులే వచ్చాయి. పాఠశాల ఆవరణల్లో పేలుడు పదార్థాలను అమర్చామని, వాటిని పేల్చకుండా ఉండాలంటే 30వేల డాలర్లు ఇవ్వాలని అగంతకులు బెదిరించారు. అయితే, అది నకిలీదని ఆ తర్వాత ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఏడాది ఆరంభం నుంచి దిల్లీ, ఇతర ప్రాంతాల్లో పాఠశాలలకు పలుమార్లు బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక, అక్టోబరులో రోహిణి ప్రాంతంలోని ఓ సీఆర్పీఎఫ్ స్కూల్ బయట బాంబు పేలుడు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa