ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ మాటను జీవితంలో మర్చిపోలేనన్న చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 13, 2024, 04:27 PM

విజయవాడలో నిర్వహించిన స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు. ఇవాళ అందరినీ చూస్తుంటే, ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టడానికి ఇక్కడ సమావేశమయ్యాం అనిపిస్తోందని అన్నారు. రాష్ట్ర దశ దిశను మార్చే స్వర్ణాంధ్ర విజన్-2047ను ఇవాళ ఆవిష్కరించామని వెల్లడించారు. "ప్రపంచంలోనే తెలుగుజాతిని నెంబర్ వన్ గా చేసేందుకు ఇవాళ బీజం పడింది.. ఇది సాధ్యమే అని మరొక్కసారి చెబుతున్నా. ప్రజల తలరాతలను, భావితరాల భవిష్యత్ ను మార్చేదే ఈ స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్. నేను చాలా ఎన్నికలు చూశాను కానీ... 2024 ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. 1978 నుంచి నేను ప్రత్యక్షంగా ఎన్నికల్లో భాగస్వామినయ్యాను. అనేక ఎన్నికల్లో పోటీ చేశాను. కానీ 2024లో 93 శాతం సక్సెస్ రేటుతో, 57 శాతం ఓట్లు పడిన ఏకైక ఎన్నికలు నా జీవితంలో మొదటిసారి చూశాను. ప్రజల్లో ఆనాడు ఉన్న వాస్తవ పరిస్థితులను పవన్ కల్యాణ్ గారు అప్పుడే గమనించి ఒక మాటన్నారు. ఆ మాట నేనెప్పుడూ కూడా మర్చిపోలేను. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేక ఓట్లు చీలడానికి వీల్లేదు... కలిసి ఉంటే బలం ఉంటుంది... కలిసి పనిచేద్దాం అని స్పష్టమైన వైఖరి ప్రదర్శించి, ఆ మేరకు కలిసి నడిచిన వ్యక్తి పవన్ కల్యాణ్. 2014లోనూ, 2024లోనూ చూశాను... నాకేం వస్తుంది అని కాకుండా... రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుంది అని ఆలోచించి పవన్ కల్యాణ్ పూర్తిగా సహకరించారు. అలాంటి ఒక మంచి మిత్రుడు ఉండడం చాలా సంతోషదాయకం. రాజకీయాల్లో నాకు ఎంతో అనుభవం ఉంది... నాలుగోసారి ముఖ్యమంత్రిని... కానీ గత ప్రభుత్వ హయాంలో ఎందుకంత విధ్వంసం జరిగిందో నాకు అర్థం కాలేదు. అన్ని ఇబ్బందులు ఎదుర్కొని, ఒక్కొక్క అడుగు వేస్తూ రాష్ట్ర పునర్ నిర్మాణం చేస్తున్నాం. కూటమి పాలనకు ఆర్నెల్లు పూర్తయిన వెంటనే... విజన్-2047 డాక్యుమెంట్ ను తీసుకువచ్చి తెలుగుజాతిని భారతదేశానికి అంకితం చేశామంటే అది మా అకుంఠిత దీక్షకు నిదర్శనం. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక శక్తిమంతమైన దేశంగా తయారవుతోంది. 2047లో మనం 100 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంది. అప్పటికల్లా మన దేశం ప్రపంచంలో ఒక అగ్రదేశంగా ఉండాలన్న ఉద్దేశంతో వికసిత భారత్-2047 కార్యాచరణను ప్రధాని మోదీ రూపొందించారు. ఆ మేరకు లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు పోతున్నారు. అందులో భాగంగానే మనం ఈ రోజు స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ తీసుకువచ్చాం. మోదీ, మనందరి ఆలోచన భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉండాలి. ఈ క్రమంలో... ఏపీతో పాటు తెలుగుజాతి కూడా ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలనేది మా సంకల్పం. నేను గానీ, పవన్ కల్యాణ్ గానీ కోరుకునేది అదే. ఇవాళ మన తలసరి ఆదాయం 3 వేల డాలర్ల కంటే తక్కువ. 2047 నాటికి 42 వేల డాలర్లు తలసరి ఆదాయం లభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పవన్ కల్యాణ్ చెప్పినట్టు... ఇంతకుముందు హైదరాబాద్, సికింద్రాబాద్ రెండే నగరాలు ఉండేవి. హైదరాబాద్ నగరం పశ్చిమ ప్రాంతానికి వెళితే ఎక్కడ చూసినా రాళ్లు, గుట్టలే ఉండేవి. ఆ గుట్టల్లో నేను భవిష్యత్ నగరాన్ని చూశాను. ఆ మేరకు 25 సంవత్సరాల్లో ప్రపంచస్థాయిన నగరం అవుతుందని భావించి, ఆ దిశగా రూపకల్పన చేశామంటే అదీ ఆనాటి విజన్ ప్రభావం. పవన్ కల్యాణ్ ఎప్పుడూ అంటుంటారు... సార్, మేమందరం అక్కడ రాళ్లు చూశాం... మీరు మాత్రం ఒక విజన్ చూశారు అని. అవును... ఆ రోజు అందులోనే నేను ఒక సింగపూర్ చూశాను, ఒక దుబాయ్ ని చూశాను, న్యూయార్క్ సిటీని చూశాను. అలాంటి నగరాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేం అని భావించి, అంచెలంచెలుగా అభివృద్ధి చేశాం. ఇవాళ హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం లభించే రాష్ట్రంగా ఉందని గర్వంగా చెప్పగలుగుతున్నాం. మేం ఆనాడు వేసిన పునాదే అందుకు కారణం" అని చంద్రబాబు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa