ట్రెండింగ్
Epaper    English    தமிழ்

12 రోజుల్లోనే రూ.75 వేలు సంపాదిస్తున్న యాచకురాలు

national |  Suryaa Desk  | Published : Fri, Dec 13, 2024, 08:03 PM

సాధారణంగా అడుక్కునేవాళ్లను చూస్తే.. చిరిగిన బట్టలు, చింపిరి జుట్టు, భోజనం లేక ఎండిపోయిన డొక్కతో ఉంటారు. ఏ మహానుభావుడు దయతలిచి ఎంతో కొంత వేస్తాడని.. రోజు మొత్తం ఎదురుచూస్తూ ఉంటారు. ఇక కొందరు యాచకులు.. కుటుంబం లేక అనాథలుగా రోడ్లపైకి వచ్చి పొట్టకూటి కోసం అడుక్కుంటూ ఉంటారు. ఇక అప్పుడప్పుడు కోట్లు కూడబెట్టిన బిచ్చగాళ్లను కూడా మనం చూస్తూనే ఉంటాం. చూడడానికి అడుక్కునేవారిలాగానే కనిపిస్తూ.. డబ్బులు, ఆస్తులు బాగా పోగేసిన వారు చాలా మందే ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అడుక్కునే మహిళ వద్ద రూ.75 వేలు కనిపించడంతో అధికారుల కళ్లు బైర్లుకమ్మాయి. అయితే ఆ సొమ్ము మొత్తం గత 10, 12 రోజుల్లోనే ఆమె సంపాదించింది అని తెలుసుకుని వారికి మూర్ఛ వచ్చినంత పనైందంటే అర్థం చేసుకోవచ్చు.


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా ఎన్నో ఏళ్ల నుంచి పేరు గాంచిన ఇండోర్ నగరాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ‌ శాఖ అధికారులు రంగంలోకి దిగి ఇండోర్‌లో చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇండోర్ నగరంలో ఉన్న యాచ‌కుల‌ను గుర్తించి.. వారిని ఉజ్జయినిలోని సేవాధామ్ ఆశ్రమానికి తరలించే కార్యక్రమం చేపట్టారు. మొత్తంగా 14 టీంలు యాచ‌కుల‌ను గుర్తించే ప‌నిలో పడ్డాయి. ఈ సంద‌ర్భంగా ఆ యాచకుల వ‌ద్ద ఎంత న‌గ‌దు, ఇత‌ర‌ వ‌స్తువులు ఉన్నాయి అనే అంశం ఇప్పుడు తీవ్ర చ‌ర్చకు దారితీస్తోంది.


అయితే ఆ యాచకుల్లో ఒక మహిళ వ‌ద్ద ఏకంగా రూ.75 వేలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆ డబ్బు గురించి అధికారులు ప్రశ్నించగా.. ఆమె చెప్పిన విషయాలు విని అధికారులు షాక్ అయ్యారు. ఈ రూ.75 వేలను ఆమె కేవ‌లం 10 నుంచి 12 రోజుల్లోనే అడుక్కుని సంపాదించిన‌ట్టు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఇండోర్ జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సింగ్‌ ఆదేశాలతో మహిళా శిశు అభివృద్ధి అధికారి దినేష్ మిశ్రా ఆధ్వర్యంలో సుమారు 14 బృందాలు ఇండోర్ నగరంలో ఉన్న దేవాలయాలు, ప్రార్థనా స్థలాల వద్ద భిక్షాటన చేస్తున్న వారిని పట్టుకుని ఉజ్జయిని సేవాధామ్ ఆశ్రమానికి పంపుతున్నాయు.


అయితే ఆ మహిళ రాజ్‌వాడ సమీపంలోని శనైశ్చర‌ ఆలయం వ‌ద్ద భిక్షాటన చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఆమెకు ఇండోర్‌లోని పాల్డా ప్రాంతంలో ఒక ఇల్లు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఇల్లుతోపాటు ఆమె పేరుతో కొంత భూమి కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గత కొన్నాళ్లుగా ఆ మహిళ శ‌నైశ్చర ఆల‌యం వ‌ద్ద అడుక్కుంటున్నట్లు తెలిపారు. అయితే ఈ శనైశ్చర ఆల‌యానికి వ‌చ్చే చాలా మంది భ‌క్తులు త‌మ శ‌ని దోషం తొలిగేందుకు.. ఇలా భారీ మొత్తంలో యాచ‌కులకు డ‌బ్బులు ఇస్తుంటార‌ని స్థానికంగా చెబుతున్నారు. అందుకే ఆమె భారీగా సంపాదించి ఉంటుంద‌ని పేర్కొంటున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa