ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యాయమూర్తులు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి: సుప్రీంకోర్టు

national |  Suryaa Desk  | Published : Fri, Dec 13, 2024, 08:18 PM

న్యాయమూర్తులు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని సుప్రీం కోర్టు వివరించింది. ముఖ్యంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, వాట్సాప్ వంటి వాటిల్లో.. తీర్పులపై వ్యక్తిగత కామెంట్లు చేయకూడదని కోరింది. సోషల్ మీడియాలో న్యాయమూర్తులు వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడం వల్ల.. ప్రజలపై అనేక ప్రభావం పడుతుందని వివరించింది. జడ్జిలు సన్యాసుల వలె జీవించాలని చెప్పింది. అంతేకాకుండా గుర్రాల లాగా పని చేయాలని.. జస్టిస్ బివి నాగరత్న, ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.


ప్రొబేషన్ సమయంలో సంతృప్తి కరంగా పని చేయలేదని ఆరోపిస్తూ మధ్య ప్రదేశ్ హైకోర్టు ఇద్దరు మహిళా జ్యుడీషియల్ అధికారులను తొలగించిన కేసును విచారిస్తున్న సమయంలో సుప్రీం కోర్టు ఈ కామెంట్లు చేసింది. అయితే ఈ కేసులో తొలగించబడ్డ న్యాయమూర్తుల్లో ఒకరు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారని, దాని వల్ల కలిగే ప్రమాదాలపై వ్యాఖ్యానించడానికి బెంచ్‌ను ప్రేరేపించారని కోర్టుకు తెలిసింది. అయితే తొలగించబడిన న్యాయమూర్తుల్లో ఒకరి తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ఆర్ బసంత్.. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించారు.


ఏ న్యాయమూర్తి అయినా తమ పనికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదని లాయర్ బసంత్ పేర్కొన్నారు. దాని వల్ల కలిగే ప్రమాదాలను కూడా వివరించారు. ముఖ్యంగా న్యాయమూర్తుల వ్యక్తిగత అభిప్రాయాలు ప్రజలపై చాలా ప్రభావం చూపిస్తాయని చెప్పుకొచ్చారు. ఇదంతా విన్న ధర్మాసనం.. న్యాయమూర్తులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని తెలిపింది. అలాగే వారు ఈ రంగంలో కొనసాగాలంటే ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుందని.. న్యాయరంగం అలాంటి అత్యున్నత స్థానంలో ఉంటుందని వివరించింది.


చట్టం ఎవరికీ చుట్టం కాదనే విషయం.. ఈ తీర్పు చూస్తుంటే అర్థం అవుతుంది. అన్ని రంగాల వారికి సూచనలు చేసే సుప్రీం కోర్టు.. న్యాయమూర్తలకు కూడా ఎలా ఉండాలో చెప్పి తాము అందరి పట్ల ఒకేలా వ్యవహరిస్తామని మరోసారి నిరూపించుకున్నట్లు అయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సుప్రీం చేసిన వ్యాఖ్యలపై ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు.


సుప్రీం చేసిన సూచనల్లో చాలా నిజం ఉందని... న్యాయమూర్తులు సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే మంచిదని అంటున్నారు. ఒకవేళ వాడినా సామాజిక అంశాలపై స్పందించకపోవడం మంచిది అని.. కావాలంటే తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వాటి గురించి మాత్రమే అప్‌డేట్స్ పెట్టుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు. మరి న్యాయమూర్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియా వాడడం మానేస్తారా లేక కంటిన్యూ చేస్తారా అనేది మున్ముందు చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa