ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ.. తొలి ప్రసంగంతోనే అదరగొట్టిన ప్రియాంక గాంధీ

national |  Suryaa Desk  | Published : Fri, Dec 13, 2024, 08:20 PM

రాజ్యాంగాన్ని ఆమోదించుకొని 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్లమెంటులో ప్రత్యేక చర్చ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తరఫున లోక్‌సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ శుక్రవారం ఈ చర్చను ప్రారంభించారు. అనంతరం వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ లోక్‌సభలో తన తొలి ప్రసంగం చేశారు. ఉన్నావ్ హత్యాచార ఘటనతో ప్రసంగం ప్రారంభించిన ప్రియాంక.. చర్చలు, యుగాల నాటి సంప్రదాయం నుంచి రాజ్యాంగం పుట్టిందని అన్నారు. స్వాతంత్య్ర పోరాటం ప్రజాస్వామ్య వాణి. ఆ గొంతుక నుంచే రాజ్యాంగం అవతరించిందని తెలిపారు.


‘‘రాజ్యాంగం అనేది కేవలం డాక్యుమెంట్ కాదు.. అంబేడ్కర్, మౌలానా అజాద్, రాజగోపాలాచారి, నెహ్రు సహా ఆ కాలం నాటి నేతలంతా రాజ్యాంగ రచనకు అనేక ఏళ్లు తమ సమయం కేటాయించారు.. పౌరులకు న్యాయాన్ని. అలాగే ప్రభుత్వాలను ఎన్నుకోడానికి.. పడగొట్టడానికి రాజ్యాంగం అందిస్తుంది’’ అని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.


‘తాను ఉన్నావ్ అత్యాచార బాధితులు, సంభల్ ఘర్షణల బాధిత కుటుంబాలను కలిశాను.. బాధితులకు పోరాటం చేసే శక్తిని రాజ్యాంగం కల్పించింది.. న్యాయం కోసం వారు పోరాటం సాగించే అవకాశం కల్పించింది.. రాజ్యాంగం ఓ రక్షణ కవచం. అయితే, రాజ్యాంగం కల్పించిన ఆర్దిక, సామాజిక రక్షణకు అధికార ఎన్డీయే తూట్లు పొడుస్తోంది.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఈ విధంగా వచ్చుండకపోతే వాళ్లు రాజ్యాంగాన్నే మార్చేయం ప్రారంభించేవారు.. గతం గురించి మాత్రమే ఎన్డీయే మాట్లాడుతోంది.. వర్తమానం గురించి ఎందుకు మౌనంగా ఉంది.. పుస్తకాలు, ప్రసంగాల నుంచి నెహ్రూ పేరును చెరిపేయవచ్చు.. కానీ, స్వాతంత్య్ర పోరాటం, జాతీ నిర్మాణంలో ఆయన పాత్రను ఎవరూ తొలగించలేరు’ అని తెలిపారు..


‘దేశంలో బీజేపీ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది.. విమర్శలు, చర్చలకు భయపడుతోంది.. దేశంలో కులగణన అవసరం.. రైతులు అద్భుతాలపై ఆశలు పెట్టుకున్నారు.. మహిళల కోటాను ఎన్డీయే ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు?.. కుట్రలు, ప్రలోభాల ద్వారా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను మోదీ సర్కారు కూల్చేస్తోంది.. బీజేపీ పార్టీ ఓ వాషింగ్ మెషిన్.. ఒక్కసారి ఆ పార్టీలో చేరితే అందరూ పునీతులవుతారు.. వేరే పార్టీలో ఉంటే వారిపై అవినీతి ముద్ర వేస్తారు.. ప్రజల గొంతుకను నొక్కేయడానికి దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోంది. ప్రొఫెసర్ల నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రజల నోరు మూయించేందుకు తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.’ అని మోదీ ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వయనాడ్ ఉప-ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా... నవంబరు 25న ఎంపీగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com