రాష్ట్రంలో నీటిసంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మాజీమంత్రి, తూర్పుగోదావరిజిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దంగా, కనీస పారదర్శకత లేకుండా నీటిసంఘాల ఎన్నికలను ఏకపక్షంగా ఈ ప్రభుత్వం నిర్వహించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో సాగునీటిసంఘాల ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించామంటూ కూటమి పార్టీలు చెప్పుకుంటున్నాయి. అధికారబలంతో, పోలీసు యంత్రాంగాన్ని చెప్పుచేతల్లో పెట్టుకుని ఈ ఎన్నికల్లో విజయం సాధించిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కనీస పారదర్శకతకు చోటు లేకుండా నిరంకుశంగా, తమకు అనుకూలంగా ఈ ఎన్నికలను నిర్వహించారు. నీటిపారుదల శాఖ ఈ సంఘాలకు నిర్వహించే ఈ ఎన్నికల్లో ఎవరైనా రైతులు టీసీ (ప్రాదేశిక నియోజకవర్గం) సభ్యుడిగా పోటీ చేయాలనుకుంటే, నీటి బకాయిలు పూర్తిగా చెల్లించి ఉండాలి. ఆ మేరకు వీఆర్ఓ నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) తీసుకోవాలి. ఇది తప్పనిసరి. అది ఉంటేనే నామినేషన్ అనుమతిస్తారు. లేకపోతే రిజెక్ట్ చేస్తారు. ప్రభుత్వం పెట్టిన నిబంధన ఇది. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం వైయస్ఆర్ సిపికి చెందిన వారు ఈ ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండేందుకు విఆర్వోలను అందుబాటులో లేకుండా చేశారు. ఎమ్మార్వో కార్యాలయాల్లో విఆర్వోలను ఉంచి, నోడ్యూస్ కోసం వచ్చిన వారిని పోలీసులతో బెదిరించి వెనక్కి పంపించారు అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa