ప్రముఖ పర్యాటక ప్రాంతమైన జమ్మూ కశ్మీర్లో శనివారం రోజు కూడా దట్టమైన మంచు కురిసింది. కాలు పెడితే చాలు మోకాళ్ల లోతు వరకు మంచు చేరుతోంది. దీని వల్ల శ్రీనగర్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గింది. దీంతో అటు రైలు, విమానాల సేవలను అధికారులు నిలిపివేశారు. అంతేకాకుండా జమ్మూ కశ్మీర్ ప్రధాన రహదారిపై కూడా పెద్ద ఎత్తున మంచు పేరుకుపోవడంతో.. రహదారిని సైతం బంద్ చేశారు. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోగా.. కశ్మీర్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందని అంతా తెలుసుకుంటున్నారు. ఆ విశేషాలు మీకోసం.
కశ్మీర్ లోయలోని అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హిమపాతం కురిసింది. దీంతో అక్కడి సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. శ్రీనగర్, కశ్మీర్ లోయలోని మైదాన ప్రాంతాల్లో శుక్రవారమే హిమపాతం ప్రారంభం కాగా.. రెండో రోజే దట్టంగా మంచు పేరుకుపోయింది. దీంతో అక్కడి ప్రజలు బయటకు వచ్చేందుకే భయపడుతున్నారు. ఎన్ని సమస్యలు ఉన్నా ఇంట్లోనే కూర్చుంటున్నారు. మరీ అత్యసవరం అయితే తప్ప అడుగు బయట పెట్టలేకపోతున్నారు.
దక్షిణ కశ్మీర్, మధ్య కశ్మీర్ మైధానాల్లో భారీ స్థాయిలో హిమపాతం కురవగా.. కశ్మీర్లోని మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరుగా మంచు కురిసింది. శ్రీనగర్లో దాదాపు 8 అంగుళాల వరకు మంచు పేరుకు పోగా.. గందర్బల్, సోనామార్గ్లో 7-8 అంగుళాల హిమపాతం నమోదు అయింది. అలాగే శ్రీనగర్-లేహ్ హైవేపై 15 అంగులాళ మంచు కురవగా.. అనంత్నాగ్ జిల్లా అనేక ప్రాంతాల్లో 17 అంగుళాల వరకు మంచు పేరుకుపోయింది. పహల్గామ్, పుల్వామా, షోపియాన్ వంటి ప్రాంతాల్లో కూడా గణనీయమైన స్థాయిలో హిమపాతం కురిసింది.
ముఖ్యంగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి(NH-44)పై భారీగా మంచు పేరుకుపోవడంతో రోడ్డును మూసివేశారు. అలాగే మంచును తొలగించి రహదారిని శుభ్రం చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. బనిహాల్-బారాముల్లా మధ్య ఉన్న రైలు సేవలను నిలిపివేశారు. రన్వే సరిగ్గా కనిపించకపోవడంతో శ్రీనగర్ నుంచి బయటకు వచ్చే విమానాల రాకపోకలను బంద్ చేశారు. శనివారం ఒక్కరోజే దాదాపు 80 శాతం విమానాలు రద్దు చేశారు. భారీ హిమపాతం కారణంగా లోయ అంతటా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 33 కేవీ స్థాయిలో 41 ఫీడర్లు, 11 కేవీ స్థాయిలో 739 ఫీడర్లు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు.
అంతేకాకుండా ఇప్పటికే పునరుద్ధరణ పనులు కూడా చేపట్టినట్లు వివరించారు. సాయంత్రంలోపు 90 శాతం కంటే ఎక్కువ ఫీడర్లను బాగు చేయిస్తామని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా హామీ ఇచ్చారు. అన్ని సేవలు నిలిపివేసినా ఆస్పత్రులకు వెళ్లే రహదారులను మాత్రం ముందుగా క్లియర్ చేస్తున్నారు. కశ్మీర్ ప్రస్తుతం చిల్లై-కలన్ను చవిచూస్తోంది. అంటే డిసెంబర్ 21వ తేదీన ప్రారంభమైన శీతాకాలపు అత్యంత కఠినమైనకాలం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa