మెల్బోర్న్ టెస్టులోనూ భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ నిర్దేశించిన 340 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ 9, విరాట్ కోహ్లీ 5 పరుగులకే పెవిలియన్కు చేరారు. దీంతో వారిద్దరూ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యలు వినిపించాయి. ఈ క్రమంలో భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ కెరీర్ను కొనసాగించాలని.. రోహిత్ మాత్రం సిరీస్ ముగిశాక ఏదొక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని వ్యాఖ్యానించాడు. ‘‘విరాట్ కోహ్లీ ఇంకా కొన్నాళ్లు ఆడొచ్చు. కనీసం మూడేళ్లు ఆడే ఛాన్స్ ఉంది. అతడి ఫిట్నెస్ బాగుంది. ఇవాళ ఔటైన తీరును వెంటనే మరిచిపోవాలి. ఇక కెప్టెన్ రోహిత్ విషయంలో ఆందోళన తప్పడం లేదు. ఏదైనా సరే అతడే నిర్ణయం తీసుకోవాలి. టాప్ ఆర్డర్లో ఆడేటప్పుడు అతడి ఫుట్వర్క్ మెరుగ్గా లేదు. అందుకే, పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడుతున్నాడు. బంతిని చాలా ఆలస్యంగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. సిరీస్ ముగిశాక ఏదొక నిర్ణయం తీసుకుంటాడని అనుకుంటున్నా. రెండో ఇన్నింగ్స్లో రోహిత్ ఔటైన తీరు ఇబ్బందికరమే. సాధారణంగా అతడు ఫ్రంట్ ఫుట్ మీద బంతిని చాలా చక్కగా ఆడతాడు. కానీ, ఈసారి పుల్ చేయబోయి పెవిలియన్కు చేరాడు. రోహిత్ ఆడేటప్పుడు ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. దీంతో ఎటాక్ చేసేందుకు రోహిత్ ప్రయత్నించాడు. అదే సమయంలో వారికి దొరికిపోయాడు’’అని రవిశాస్త్రి వెల్లడించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa