ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలోనే మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జి.. దాని విశేషాలేంటి, ఎక్కడ నిర్మించారో తెలుసా

national |  Suryaa Desk  | Published : Mon, Dec 30, 2024, 08:21 PM

భారత్‌లో ఉన్న పర్యాటక ప్రదేశాలు, ప్రకృతి అందాలను చూసేందుకు దేశంలోని ప్రజలే కాకుండా అంతర్జాతీయ పర్యాటకులు కూడా వస్తూనే ఉంటారు. అయితే పర్యాటకులను ఆకర్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం.. ఓ గ్లాస్ బ్రిడ్జిని నిర్మించింది. తమిళనాడులోని కన్యాకుమారి వద్ద సముద్రంలో గాజు వంతెనను నిర్మించగా.. తాజాగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దాన్ని ప్రారంభించారు. అయితే ఈ అద్దాల బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.


కన్యాకుమారి వద్ద సముద్రంలో ఉన్న వివేకానంద రాక్‌, తిరువళ్లువర్‌ విగ్రహం మధ్య చేపట్టిన గాజు వంతెన నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం జరుపుకుంది. తమిళనాడు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గతేడాది చేపట్టిన ఈ గాజు వంతెన.. తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. ఈ గ్లాస్ బ్రిడ్జి త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. 77 మీటర్ల పొడవు ఉన్న ఈ అద్దాల వంతెన.. 10 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. ఇక ఈ గ్లాస్ బ్రిడ్జి నిర్మాణ వ్యయం.. రూ.37 కోట్లు కాగా.. గత ఏడాది మే 24వ తేదీన శంకుస్థాపన చేయగా.. ఇటీవలె పూర్తయింది.


తమిళనాడు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో చెన్నైకి చెందిన వీఎంఈ ప్రీకాస్ట్ ప్రొడక్ట్స్ కంపెనీ ఈ గాజు బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టింది. ఈ బ్రిడ్జిని రెండు వైపులను కలుపుతూ ఉండేలా.. పైకప్పును ఉక్కుతో నిర్మించారు. అలాగే ఈ వంతెనను స్టీల్ ప్లాట్‌ఫారమ్‌పై రెండున్నర మీటర్ల గాజు పలకలతో ఏర్పాటు చేశారు. కన్యాకుమారి త్రివేణి సంగమంలోని తిరువళ్లువర్ విగ్రహం రజతోత్సవ వేడుకలు మంగళ, బుధవారాల్లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అందుకు ఒక్క రోజు ముందుగానే ఈ గాజు వంతెనను ప్రారంభించడం గమనార్హం.


2000 జనవరి 1వ తేదీన కన్యాకుమారి వద్ద సముద్రంలో తిరువళ్లువర్ విగ్రహాన్ని అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ప్రారంభించారు. ఈ విగ్రహాన్ని 133 అడుగుల ఎత్తులో నిర్మించారు. 2004లో వచ్చిన సునామీని సైతం తట్టుకుని ఆ తిరువళ్లువర్ విగ్రహం నిలబడింది. ఆ సునామీలో తిరువళ్లువర్ విగ్రహానికి ఎలాంటి నష్టం జరగకపోవడం గమనార్హం.


 తమిళనాడులోనే ప్రముఖ పర్యాటక ప్రాంతం కన్యాకుమారి. అక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం చూసేందుకు.. చాలా మంది పర్యాటకులు గంటల తరబడి నిత్యం వేచిచూస్తూ ఉంటారు. అంతేకాకుండా అక్కడ సముద్రంలో కొంత దూరంలో తిరువళ్లువర్‌ విగ్రహం, వివేకానంద స్మారక మండపం ఉంటాయి. కన్యాకుమారికి వచ్చిన వచ్చే పర్యాటకులు వివేకానంద స్మారక మండపానికి బోట్‌సఫారీ చేసి వెళ్తూ ఉంటారు. అయితే వివేకానంద స్మారక మండపానికి పక్కనే ఉన్న తిరువళ్లువర్‌ విగ్రహానికి మాత్రం వెళ్లడానికి కాస్త కష్టంగా ఉండేది. ఈ నేపథ్యంలోనే తిరువళ్లువర్‌ విగ్రహం, వివేకానంద స్మారక మండపాలను కలిపేలా ఒక బ్రిడ్జి నిర్మించాలని పర్యాటకులతోపాటు స్థానికులు కూడా అనేకసార్లు తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం.. ఆ రెండు ప్రాంతాలను కలుపుతూ అద్దాల వంతెనను నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa