టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కొంతకాలంగా టెస్టుల్లో ఫామ్ లేమితో తంటాలు పడుతున్నాడు. స్వదేశంలో కివీస్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్లో నిరాశపర్చిన రోహిత్..ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ సిరీస్లోనూ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వస్తున్నాయి. దీంతో అతను కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సిడ్నీ వేదికగా ఆసీస్తో జరిగే ఐదో టెస్టు తర్వాత టెస్టు కెరీర్కు గుడ్ బై చెప్పాలని రోహిత్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న బీసీసీఐ పెద్దలు, సెలక్టర్లు రోహిత్తో మాట్లాడారట. కానీ, రోహిత్ తన మనసు మార్చుకునే అవకాశం లేదని సమాచారం. ఒకవేళ అదృష్టం కలిసొచ్చి టీమ్ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరితే ఆ మ్యాచ్ వరకు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని సెలక్టర్లు రోహిత్ను ఒప్పించే ఛాన్స్ ఉంది. దీన్ని బట్టి భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించకపోతే.. సిడ్నీలో కంగారులతో జరిగే ఐదో టెస్టు రోహిత్కు కెరీర్లో చివరి టెస్టు అవుతుంది.
మెల్బోర్న్ టెస్టులో ఓడి టీమ్ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ ఫైనల్కు చేరాలంటే ఎంతో అదృష్టం కలిసి రావాలి. టీమ్ఇండియా ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో ఉండాలంటే ఆసీస్తో సిడ్నీలో జరిగే చివరి టెస్టులో తప్పక గెలవాలి. ఓడినా లేదా డ్రా చేసుకున్నా భారత్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. సిడ్నీ టెస్టులో గెలిచినా భారత్ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాలి. జనవరి ఆఖర్లో ఆస్ట్రేలియా, శ్రీలంకల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ను శ్రీలంక 2-0తో కైవసం చేసుకుంటేనే భారత్ ఫైనల్కు చేరుతుంది. ఒకవేళ భారత్, ఆసీస్ మధ్య చివరి టెస్టు డ్రాగా ముగిసి.. శ్రీలంక 2-0తో కంగారులపై గెలిస్తే లంకేయులు తుది పోరుకు అర్హత సాధిస్తారు. ఆస్ట్రేలియా మిగిలిన మూడు టెస్టుల్లో (భారత్తో 1, శ్రీలంకతో 2) ఒక్కటి గెలిచినా ఫైనల్కు చేరుకుంటుంది. జనవరి 3 నుంచి ఆసీస్, భారత్ మధ్య ఐదో టెస్టు ప్రారంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa