నూతన సంవత్సరం సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తున్నారు. ఈ విధంగానే చిత్తూరు జిల్లాలోని ప్రముఖ దేవాలయం కాణిపాకానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్థానికులతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా కాణిపాకం వినాయకుడి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ కాణిపాకం వినాయకుడి ఆలయాన్ని బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా కాణిపాకం ఆలయానికి భక్తులు వస్తున్నట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు.
భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని.. నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడికీ స్వామి దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు స్వామివారికి అభిషేకం, చందనాలంకారం నిర్వహించామని.. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకే భక్తులకు స్వామి దర్శనాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. ఉచిత దర్శనంతో పాటు భక్తుల కోసం రూ.100, రూ.150 దర్శనం కూలైన్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలాగే కాణిపాకం వచ్చే భక్తుల కోసం 8000 పెద్దలడ్డూలు, 80000 వేల చిన్న లడ్డూలు సిద్ధం చేసి, కౌంటర్లలో అందుబాటులో ఉంచినట్లు ఆలయ ఈవో వెల్లడించారు.
మరోవైపు కాణిపాకం ఆలయానికి వచ్చే భక్తుల కోసం అధికారులు బుధవారం నుంచి ఓ వినూత్న కార్యక్రమం ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో క్యూలైన్లలోని భక్తులకు పాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. క్యూలైన్లలోని భక్తులకు బాదంపాలు, బిస్కెట్లు పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో పెంచల కిషోర్ ప్రారంభించారు. ప్రతిరోజూ ఈ కార్యక్రమం కొనసాగేలా చూస్తామని కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్ వెల్లడించారు. దూర ప్రాంతాల నుంచి దర్శనం కోసం వచ్చే భక్తులు.. క్యూలైన్లలో ఎదురు చూస్తుంటారని.. వారికి ఉపయోగపడేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దీనిపై భక్తుల నుంచి కూడా హర్షం వ్యక్తమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa