5జీ, 6జీ అంటూ ప్రపంచం వేగంగా దూసుకెళ్తోంది. రోబోటిక్స్, కృత్తిమమేధ అంటూ సాంకేతికత సరికొత్త పుంతలు తొక్కుతోంది. కానీ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా మన బళ్లోని పాఠాలు మారుతున్నాయా అంటే బిక్కచూపులు చూడాల్సిన పరిస్థితి. ప్రపంచం పరిగెడుతున్న వేగాన్ని మన పాఠశాలల్లోని పిల్లలు అందుకోగలరా అంటే అంతుబట్టని స్థితి. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్ వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ పేరుతో కొత్త కార్యక్రమం మొదలెట్టింది. ఇందుకోసం ఇన్ఫోసిస్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి రంగాల్లో అవగాహన కల్పించేందుకు వాహనాలే స్కూళ్ల వద్దకు వెళ్తాయి. ఆ రకంగా ఈ వాహనాలను సిద్ధం చేస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద మంగళగిరిలో తొలుత ఈ కార్యక్రమం అమలు చేస్తారు. ఆ తర్వాత దశలవారీగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. ఈ వాహనాన్ని మంత్రి నారా లోకేష్ శుక్రవారం ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టుగా ఈ వాహనం మంగళగిరిలోని స్కూళ్లకి వెళ్లి పిల్లల్లో అవగాహన కల్పిస్తుందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్లకు వాహనాలను పంపిస్తామని నారా లోకేష్ తెలిపారు. నైపుణ్య అవకాశాలను విద్యార్థుల వద్దకే తీసుకెళ్లేందుకు ఇన్ఫోసిస్ భాగస్వామ్యం కావడం అభినందనీయమని కొనియాడారు.
మరోవైపు ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ కోసం ఇన్ఫోసిస్ సంస్థ రూ. 5 కోట్ల ఖర్చుతో ఈ వాహనం ఏర్పాటు చేసింది. ఇందులో ట్యాబ్లు, ల్యాప్టాప్లతో పాటుగా అత్యాధునిక మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు.ఈ మొబైల్ ల్యాబ్ నిర్వహణ కోసం ఇన్ఫోసిస్ ప్రతి ఏడాది రూ. 40 లక్షల నిర్వహణ వ్యయాన్ని భరించనుంది. అలాగే విద్యార్థులకు కంటెంట్తో పాటు ట్రైనర్ సపోర్టు కూడా ఇన్ఫోసిస్ అందిస్తుంది. ఒక్కో విద్యార్థికి రూ.1,500 చొప్పున ఖర్చు చేస్తుంది.
ఈ మొబైల్ ల్యాబ్లో 90 నిమిషాల వ్యవధిలో విద్యా్ర్థులకు ఇంటరాక్టివ్ లెర్నింగ్ సెషన్ ఉంటుంది. ఆ తర్వాత విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డు ద్వారా ఉచితంగా వివిధ కోర్సులు నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తారు. కోర్సులు పూర్తైన తర్వాత సర్టిఫికేట్ కూడా అందజేస్తారు. ప్రతి మూడు నెలలకు 4,800 మంది విద్యార్థులను ఇలా శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa