ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఏపీ ప్రభుత్వం గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు కూడా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం శనివారం (జనవరి 4) నుంచి అమల్లోకి వచ్చింది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ స్కీమ్ కోసం ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది రూ.27.39 కోట్లు ఖర్చు చేయనుంది. అలాగే వచ్చే విద్యా సంవత్సరం కోసం రూ.85.84కోట్లు కేటాయించారు.
ఈ పథకం ద్వారా ఏపీవ్యాప్తంగా ఉన్న 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న 1,48,419 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు. ఈ 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీలల్లో 398 కాలేజీలు.. సమీపంలోని పాఠశాలలకు అనుసంధానమై ఉన్నాయి. దీంతో ఇంటర్ కాలేజీ విద్యార్థులకు కూడా పాఠశాలల్లోనే భోజనం తయారు చేస్తారు. మిగతా వాటి కోసం కేంద్రీకృత వంటశాలలు ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థుల్లో చాలా మంది దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి కాలేజీకి వస్తుంటారు. కళాశాల సమయానికి చేరుకోవాలంటే ఉదయాన్నే బయల్దేరాల్సిన పరిస్థితి. ఇలాంటి వారికి మధ్యాహ్న భోజనం ఇబ్బందికరంగా ఉండేది. ఈ నేపథ్యంలోనే పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉపయోగపడేలా ఇంటర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది.
ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం మెనూ వివరాలు
ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం మెనూ విషయానికి వస్తే.. సోమవారం ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ, అన్నం, ఆకుకూర పప్పు అందిస్తారు. మంగళవారం అన్నం, కోడిగుడ్డు కూర, పప్పు, రసం, రాగిజావ అందిస్తారు. బుధవారం రోజున ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ, వెజ్ పులావ్, ఆలూ కుర్మా ఇస్తారు. గురువారం అన్నం, సాంబార్, రాగిజావ, కోడిగుడ్డు కర్రీ మెనూలో ఉంటుంది. శుక్రవారం రోజున పులిహోర, గోంగూర/కూరగాయలతో చేసిన చట్నీ, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ అందిస్తారు. శనివారం రోజున అన్నం, రసం, పొంగల్ స్వీట్, వెజ్ కర్రీ అందిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa