ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్న జాగ్రత్తలు, అలవాట్లతో సులువుగా బరువు తగ్గొచ్చని చెబుతున్న నిపుణులు

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Jan 19, 2025, 03:52 PM

ఇటీవలికాలంలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. వ్యాయామం లేని సెడెంటరీ జీవన శైలి, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటివి శరీరంలో కొవ్వు పేరుకుపోయేందుకు కారణం అవుతున్నాయి. అధిక బరువు కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు ముసురుకుంటున్నాయి. దీనిని గుర్తించి బరువు తగ్గేందుకు ఎంతో మంది తంటాలు పడుతున్నారు. అలాంటి వారు కొన్ని చిన్న జాగ్రత్తలు, అలవాట్లతో సులువుగా బరువు తగ్గేందుకు వీలవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత వీటిని పాటిస్తే మంచి ప్రయోజనం ఉంటుందని వివరిస్తున్నారు.భోజనం చేసిన కొంత సేపటి తర్వాత కెఫీన్ ఉండని హెర్బల్ టీ తాగడం బరువు తగ్గేందుకు తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చమోమైల్ (గడ్డి చామంతి), పుదీనా టీ వంటివి తీసుకోవాలని... ఇవి శరీరానికి విశ్రాంతి భావన ఇస్తాయని, మంచి నిద్రకూ తోడ్పడతాయని వివరిస్తున్నారు.భోజనం తర్వాత ఐస్ క్రీమ్ లు, ఇతర చక్కెర ఉండే పదార్థాలకు కచ్చితంగా దూరంగా ఉండాలి. దానికి బదులు ఏవైనా పండ్లు వంటివి తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గేందుకు ఇది తోడ్పడుతుందని వివరిస్తున్నారు.భోజన సమయానికి ముందు ఐదు, పది నిమిషాల పాటు డీప్ బ్రీతింగ్ ను ప్రాక్టీస్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కడైనా కుదురుగా కూర్చుని, దీర్ఘంగా శ్వాస తీసుకుని, మెల్లగా వదులుతూ ఉండాలని చెబుతున్నారు. ఇది శరీరంలో ఒత్తిడిని, హార్మోన్లను నియంత్రిస్తుందని... అతిగా తినడాన్ని అడ్డుకుంటుందని, బరువు తగ్గేందుకు తోడ్పడుతుందని వివరిస్తున్నారు. భోజనం చేసిన తర్వాత మెల్లగా పది, పదిహేను నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల ఆహారం బాగా జీర్ణం అవుతుందని... శరీరంలో మెటబాలిజం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కడుపు ఉబ్బరం వంటివీ తగ్గుతాయని వివరిస్తున్నారు. భోజనం తర్వాత వాకింగ్ వల్ల రక్తంలో షుగర్ స్థాయులు నియంత్రణలోకి వస్తాయని పేర్కొంటున్నారు.వినడానికి ఇది ఫన్నీగా ఉన్నా చాలా మంచి అలవాటు అని నిపుణులు చెబుతున్నారు. రాత్రి వీలైనంత త్వరగా భోజనం చేసి, ఆ వెంటనే వంటగదిని, ఫ్రిడ్జ్ ను క్లోజ్ చేయాలని సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి భోజనం తర్వాత మంచి నీళ్లు మినహా ఎలాంటి ఆహారం, పానీయాలు తీసుకోకుండా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ఇది నోటిపై అదుపుకోసం, బరువు తగ్గడానికి తోడ్పడుతుందని వివరిస్తున్నారు. అయితే షుగర్ వంటి సమస్యలు ఉన్నవారికి మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుందని చెబుతున్నారు.భోజనం తర్వాత ఫోన్, కంప్యూటర్, టీవీ... ఇలా అన్ని రకాల స్క్రీన్లకు దూరంగా ఉండాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆ సమయంలో పుస్తకాలు చదవడం, మెడిటేషన్ చేయడం వంటివి అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల నిద్రలో నాణ్యత పెరిగి, శరీరంలో ఒత్తిడి తగ్గి... బరువును నియంత్రణలో ఉంచుకునేందుకు తోడ్పడుతుందని స్పష్టం చేస్తున్నారు.భోజనం చేసిన కాసేపటి తర్వాత బ్రష్ చేసుకోవడం వల్ల ఇంకా ఏమైనా తినాలన్న కోరిక తగ్గిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారం తీసుకోవడం పూర్తయింది, ఇక నిద్రపోవడమే తరువాయి అని మెదడు సంకేతాలు ఇస్తుందని... బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి అలవాటు అని వివరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa