కొండపావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. హోం మంత్రి అమిత్ షా సారథ్యంలో దేశంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని అన్నారు. అన్ని అంశాల్లోనూ అమిత్ షా వినూత్నంగా ఆలోచిస్తారని, ఏపీ పునర్ నిర్మాణం విషయంలోనూ కొత్తగా ఆలోచించాలని అమిత్ షా సూచించారని వెల్లడించారు. గత ఎన్నికల్లో 93 శాతం స్ట్రయిక్ రేట్ తో ఏపీలో ఘనవిజయం సాధించామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఏపీ అప్పు రూ.10 లక్షల కోట్లు ఉందన్నారు. ఎన్నికల సమయానికే ఏపీ వెంటిలేటర్ పై ఉందని అన్నారు. కేంద్రం ఆక్సిజన్ అందించడంతో ఏపీ వెంటిలేటర్ స్థితి నుంచి బయటపడిందని, అందుకు కేంద్రం పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వివరించారు. అయితే, ఏపీ వెంటిలేటర్ స్థితి నుంచి బయటపడినా, ఇంకా పేషెంట్ గానే ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతి నిర్మాణం కోసం కేంద్రం రూ.15 వేల కోట్లు ఇచ్చిందని, ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. కేంద్రం మార్గదర్శకత్వంలో పోలవరం డయాఫ్రం వాల్ పనులు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మద్దతుతో 2027 ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక, తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,440 కోట్ల ప్యాకేజీతో ఆర్థికసాయం చేసి ప్రాణం పోశారని చంద్రబాబు కొనియాడారు. ఇటీవల విశాఖ రైల్వే జోన్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు కేంద్రం మద్దతు ఇంకా కావాలని ఆకాంక్షించారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రధాని మోదీ కలను సాకారం చేసేందుకు అందరం కృషి చేస్తున్నామని, ఏపీలోనూ విజన్-2047 లక్ష్యంగా ముందుకెళుతున్నామని తెలిపారు. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటుందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa