ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతరిక్షం నుంచి మహా కుంభమేళా, ఇస్రో ఫోటోలు విడుదల.. భారతదేశ పటం లాగే శివాలయ పార్క్

national |  Suryaa Desk  | Published : Wed, Jan 22, 2025, 08:35 PM

ఇప్పుడు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మహా కుంభమేళా గురించి చర్చ జరుగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం అయిన మహా కుంభమేళా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. దేశ, విదేశాల నుంచి భక్తులు, సాధువులు సహా 40 కోట్ల నుంచి 45 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తుండగా.. ఈనెల 13వ తేదీన ప్రారంభమైన ఈ మహా కుంభమేళా వచ్చే నెల 26వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ క్రమంలోనే స్పేస్ నుంచి ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద హడావుడికి సంబంధించిన చిత్రాలను ఇస్రో విడుదల చేసింది.


ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాకు సంబంధించిన స్పేస్‌ వ్యూ చిత్రాలను తాజాగా ఇస్రో విడుదల చేసింది. త్రివేణి సంగమం వద్ద ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలకు సంబంధించి హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సేకరించిన ఫోటోల్లో వెల్లడి అవుతోంది. ప్రయాగ్‌రాజ్‌లో నిర్మించిన తాత్కాలికంగా టెంట్ హౌస్‌లు, తేలియాడే వంతెనలు ఏర్పాటు చేయగా.. కొన్ని నెలలకు ముందు, ఇప్పటికీ మధ్య తేడా ఆ ఫోటోల్లో స్పష్టంగా అర్థం అవుతోంది.


మరోవైపు.. మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటు చేసిన శివాలయ పార్క్‌ కూడా ఆ ఫోటోల్లో కనిపిస్తోంది. 2024 ఏప్రిల్ 6వ తేదీన అంతరిక్షం నుంచి తీసిన ఫొటోలో ఆ ప్రాంతం మొత్తం ఖాళీగా కనిపించింది. ఇటీవల 2024 డిసెంబర్ 22వ తేదీన.. 2025 జనవరి 10వ తేదీన తీసిన చిత్రాల్లో వివిధ మౌలిక సదుపాయాలతో పాటు అక్కడి శివాలయ పార్క్‌ కూడా దర్శనం ఇచ్చింది. ఈ శివాలయ పార్క్ భారతదేశం మ్యాప్‌లాగా కనిపించింది.


ఇదిలా ఉంటే.. 45 రోజుల పాటు సాగే ఈ మేళా ద్వారా రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు రూ.2 లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరనుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే 12 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి కూడా లభిస్తుందని తెలిపాయి. 10,000 ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు జరిగాయని, ఏ సమయంలోనైనా 50 లక్షల మంది నుంచి కోటి మంది పుణ్యస్నానాలు చేసేలా సౌకర్యాలను కల్పించామని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఇప్పటికే వెల్లడించారు.


సంక్రాంతి రోజున జనవరి 13వ తేదీన మొదలైన మహా కుంభమేళా ఫిబ్రవ‌రి 26వ తేదీన మ‌హా శివ‌రాత్రితో 45 రోజుల పాటు ముగియనుంది. ఈ మహా కుంభమేళాకు 45 కోట్ల మంది భక్తులు వస్తారని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. వీరి కోసం 1.60 ల‌క్షల టెంట్లను ఏర్పాటు చేశారు. 1.50 ల‌క్షల టాయిలెట్లను నిర్మించారు. దాదాపు 15 వేల మంది పారిశుద్ధ్య కార్మికులను విధుల్లో ఉంచారు. 1250 కిలోమీట‌ర్ల దూరం పైప్‌లైన్లు వేశారు. 67 వేల ఎల్ఈడీ లైట్లు.. 2 వేల సోలార్ లైట్లు.. 3 ల‌క్షల చెట్లను ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు.


మరోవైపు.. మహా కుంభమేళాకు వచ్చే భక్తులకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే చికిత్స చేసేందుకు 100 పడకలతో ఒక సెంట్రల్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. వీటితోపాటు రెండు 20 ప‌డ‌క‌ల స‌బ్ సెంట‌ర్ ఆస్పత్రుల‌ు, 25 ఫ‌స్ట్ ఎయిడ్ కేంద్రాల‌ను నిర్మించారు. 125 అంబులెన్సులను అందుబాటులో ఉంచారు. ఈ మహా కుంభమేళా వల్ల ఉత్తర్‌ప్రదేశ్‌లో రూ.2 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని నిపుణులు అంచనా వేశారు. మరోవైపు.. 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు.. 8 లక్షల మందికి ఉపాధి కలగనున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa