దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు కూడా కేంద్ర ప్రభుత్వం సహకారంతో మోక్షం లభిస్తోంది. ఈ క్రమంలోనే నంద్యాల జిల్లా మీదుగా అమరావతికి జాతీయ రహదారి ఏర్పాటు ప్రక్రియ.. వేగం పుంజుకుంది. అనంతపురం జిల్లా నుంచి అమరావతికి జాతీయ రహదారి ఏర్పాటు చేయాలని 2017లో టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో భాగంగా అనంతపురం నుంచి గుంటూరు వరకు ఉన్న జాతీయ రహదారి- 544డిని విస్తరించాలని నిర్ణయించారు. అయితే ఆ తర్వాతి కాలంలో ఈ ప్రాజెక్టు అలైన్మెంట్ మారింది. ఎక్స్ప్రెస్ హైవేగా మార్చాలని భావించారు. ఆ తర్వాత ప్రాజెక్టు అటకెక్కింది.
అయితే టీడీపీ కూటమి సర్కారు తిరిగి అధికారంలోకి రావటంతో ఈ రహదారి నిర్మాణానికి తిరిగి అడుగులు పడ్డాయి. కేంద్రం సహకారంతో ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. అందులో భాగంగా అనంతపురం నుంచి తాడిపత్రి నియోజకవర్గంలోని బుగ్గ వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణం జరుగుతోంది. తాజాగా బుగ్గ నుంచి నంద్యాల జిల్లాలోని పచ్చర్ల వరకూ ఈ రహదారి విస్తరణ పనులపై కీలక అప్ డేట్ వచ్చింది. బుగ్గ నుంచి గిద్దలూరు వరకు మొత్తం 135 కిలోమీటర్ల మేరకు నాలుగు వరుసల రహదారిగా విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే అనంతపురం నుంచి అమరావతికి మరింత వేగంగా చేరుకోవచ్చు.
రహదారి విస్తరణ పనుల్లో భాగంగా నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లి, గోస్పాడు మండలాల మీదుగా పనులు జరగనున్నాయి. మహానంది మండలంలోని గాజులపల్లె వద్ద ఉన్న నంద్యాల- ఒంగోలు రాష్ట్ర రహదారితో అనుసంధానం చేస్తారు. అయితే ఈ పనులకు కేంద్రం ఇటీవల ఆమోదం తెలిపింది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఎలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. దీంతో త్వరలోనే పనులు మొదలెట్టనున్నారు. రహదారి విస్తరణ పనులకు 275 హెక్టార్ల భూమి అవసరం అవుతుందని అంచనా వేశారు. భూ సేకరణకు వంద కోట్ల వరకూ ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. సివిల్ పనులతో కలిపి మొత్తంగా రూ. 2,812 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు బుగ్గ - గిద్దలూరు మధ్యన 135 కిలోమీటర్ల మేరకు రహదారి విస్తరణ జరగనుంది. ఇందులో 25 కిలోమీటర్ల మార్గం దట్టమైన అడవిలో ఉంటుంది. అటవీ ప్రాంతంలో నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపట్టేందుకు అనుమతులు కావాలని కేంద్ర ఆటవీ శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అటవీశాఖ అనుమతుల మంజూరు చేస్తే నాలుగు వరుసల రహదారి నిర్మిస్తారు. ఒకవేళ అనుమతులు రాకుంటే ఆ 25 కిలోమీటర్ల దూరం రెండు వరుసల రహదారిని నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఎలైన్మెంట్ అప్రూవల్ కమిటీ సూచించింది. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా పలుచోట్ల బైపాస్ల నిర్మాణం చేపట్టనున్నారు. నంద్యాల జిల్లాలోని అంకిరెడ్డిపల్లె, రాఘవరాజుపల్లె, రామాపురం, కొలిమిగుండ్ల సహా పలుచోట్ల బైపాస్లు నిర్మించాలని ప్రణాళికల్లో సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa