వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త మార్కెట్ ధరలు అమలు కానుండటంతో.. ఆలోపే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని జనం భావిస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు రద్దీ పెరగడంతో సీఎఫ్ఎంఎస్ సర్వర్ ఓపెన్ కావడం లేదని జనం చెబుతున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయినట్లు పేర్కొంటున్నారు. అయితే రేపు ఒక్కరోజే సమయం ఉండటంతో.. రేపు కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రిజిస్ట్రేషన్ల కార్యాలయాలకు తాకిడి పెరగడంతోనే సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ఓపెన్ కాకుండా సర్వర్లు మొరాయిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి ఇదే పరిస్థితి ఉండటంతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్దిసేపు ఓపెన్ అయి.. మళ్లీ వెంటనే మొరాయిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. అధిక మొత్తంలో రిజిస్ట్రేషన్ల కోసం భూముల యజమానులు, కొనుగోలుదారులు రావడంతోనే సర్వర్లు మొరాయిస్తున్నాయని.. రేపు కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల మార్కెట్ ధరలు పెంచుతున్నట్లు ఇప్పటికే చంద్రబాబు సర్కార్ వెల్లడించింది. అయితే మంగళవారం, బుధవారాల్లో అమావాస్య రావడంతో ఇవాళ.. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. గుంటూరు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భారీగా భూముల అమ్మకందారులు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్లు మొరాయిస్తున్నాయని వాపోతున్నారు. అయితే నిత్యం 70 నుంచి 80 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో.. ఇవాళ 100 నుంచి 150 వరకు పైగా రిజిస్ట్రేషన్లు చేయాల్సి రావటంతో సర్వర్లు డౌన్ అవుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. గ్రోత్ కారిడార్లలో రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నట్లు ఇప్పటికే మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఛార్జీల పెంపు సాధారణంగా 15-20 శాతం మధ్య ఉంటుందని పేర్కొన్నారు. రెవెన్యూ ఆదాయం పెంపు రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడుతుందని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను క్రమబద్ధీకరిస్తున్నామని.. కొన్ని చోట్ల ధరలు తగ్గితే.. మరికొన్ని చోట్ల పెరగనున్నట్లు వివరించారు. నాలా పన్ను కూడా రేషనలైజ్ చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఇక రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించిన్నట్లు మంత్రి తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa