దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం రికార్డ్ గరిష్ఠాల వైపు దూసుకెళ్తున్నాయి. కరోనా సమయంలో భారీగా పడిపోయినప్పటికీ వేగంగా పుంజుకున్నాయి. ఇటీవలి కాలంలో యువత ఎక్కువగా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. డే ట్రేడింగ్ నుంచి దీర్ఘకాలిక పెట్టుబడుల వరకు నిత్యం ట్రేడింగ్ జరుగుతుంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజీ, జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ అని రెండు ఎక్స్చేంజీలు ఉంటాయి. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం కంపెనీల్లో ప్రజావాటా ఉండాలి. అందుకు కంపెనీలు మార్కెట్లలోకి లిస్టవుతుంటాయి. వందల కంపెనీలు మార్కెట్లలో ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వస్తున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లలో కేవలం రూపాయికే లభించే చాలా పెన్నీ స్టాక్స్ అందుబాటులో ఉన్నాయి. చాలా మంది తక్కువ ధరకు లభించే స్టాక్స్నే చూస్తుంటారు. కానీ, భారత మార్కెట్లలో అత్యధిక ధర కలిగిన స్టాక్స్ ఏవి ఉన్నాయో మీకు తెలుసా? ఫిబ్రవరి 3, 2025 నాటి ట్రేడింగ్ ప్రకారం చూసుకుంటే కొన్ని బాహుబలి స్టాక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓ స్టాక్ ఏకంగా రూ.1.56 లక్షలు పలుకుతోంది.
ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ కంపెనీ స్టాక్ ధర ప్రస్తుతం రూ.1,56,299 వద్ద ఉంది. ఈ కంపెనీ ఇతర సంస్థల్లో పెట్టుబడి పెడుతుంది. దేశీయ మార్కెట్లో ఇదే బాహుబలి స్టాక్.
రెండో స్థానంలో మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ స్టాక్ నిలిచింది. ఈ షేరు ధర రూ. 1,37,793 వద్ద ఉంది. దేశంలో టైర్లు తయారు చేసే సంస్థల్లో ఈ కంపెనీ అగ్రస్థానంలో ఉంది.
మూడో స్థానంలో ఫేజ్ ఇండస్ట్రీస్ కంపెనీ స్టాక్ రూ.47,278 వద్ద ట్రేడవుతోంది. జాకీ పేరుతో లోదుస్తులు, లాంజ్ వేర్, సాక్స్లను విక్రయిస్తుంటుంది.
నాలుగో స్థానంలో హనీవెల్ ఆటోమేషన్ ఇండియా లిమిటెడ్ కంపెనీ స్టాక్ నిలిచింది. ఈ షేరు ధర రూ. రూ.38,109 వద్ద ఉంది. ఏరో స్పేస్, బిల్డింగ్ తదితర పరిశ్రమలకు ఆటోమేషన్, సాఫ్ట్వేర్ సేవలు అందిస్తుంది.
ఐదో స్థానంలో యమున సిండికేట్ కంపెనీ స్టాక్ నిలిచింది. ఈ షేరు ధర రూ.36,152 వద్ద కొనసాగుతోంది.
ఆరో స్థానంలో 3M ఇండియా కంపెనీ స్టాక్ రూ.29,464 వద్ద ఉంది.
బాష్ (Bosch) కంపెనీ షేరు రూ.28,477 వద్ద ఉంది.
శ్రీ సిమెంట్ కంపెనీ స్టాక్ ధర రూ.27,555 వద్ద ఉంది.
బాంబే ఆక్సిజన్ కంపెనీ స్టాక్ రూ.26,700 వద్ద ఉంది.
అబోట్ ఇండియా కంపెనీ స్టాక్ రూ.25,977 వద్ద కొనసాగుతోంది.