సింహాద్రిపురం మండలంలోని పైడిపాళెం గ్రామంలో వెంకటలక్ష్మి అనే మహిళ ఇంట్లో సోమవారం గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామస్థుల సమాచారం మేరకు.. వెంకటలక్ష్మి తన సొంత పనుల నిమిత్తం బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చి వంట చేసేందుకు గ్యాస్ పొయ్యిని వెలిగించబోయింది. కాగా గ్యాస్ లీక్ అయిన విషయాన్ని గమనించని వెంకటలక్ష్మి స్టౌవ్ వెలిగించేందుకు లైటర్ ఆన్ చేయగా ఒక్కసారిగా సిలిండర్ పేలింది. ప్రమాదంలో బాధితురాలికి తీవ్రగాయాలయ్యాయి. బాధితురాలిని వెంటనే పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. పేలుడు తీవ్రతకు ఇంటి పైకప్పుతో పాటు గోడల మధ్యన చీలికలు రావడంతో పాటు ఇంట్లోని ఫ్రిజ్, టీవీ తదితర సామగ్రి కూడా పాడైపోయాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.