ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నందిగామ మున్సిపల్ చైర్మన్‌‌ పదవి టీడీపీ కైవసం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 04, 2025, 05:02 PM

ఎన్టీఆర్ జిల్లా, నందిగామలో మూడు రోజుల ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. నందిగామ మున్సిపల్ చైర్మన్‌‌గా  మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. టీడీపీకి 15, వైసీపీకి అనుకూలంగా మూడు ఓట్లు పడటంతో కృష్ణకుమారి విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. టీడీపీ అధిష్టానం ఆదేశాలతో కృష్ణకుమారికి మద్దతుగా ఎమ్మెల్యే, ఇతర సభ్యులు ఓటేశారు. మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికైన కృష్ణకుమారికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు. గత మూడు రోజులుగా నందిగామ మున్సిపల్ చైర్మన్‌ ఎన్నికకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి టీడీపీ ప్రతినిధిగా, ఎమ్మెల్యేగా తంగిరా సౌమ్య కొనసాగుతున్న విషయం తెలిసిందే.మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఎమ్మెల్యే సౌమ్య ఓ పేరును ప్రతిపాదించగా, ఎంపీ కేశినేని శివనాథ్ మరో పేరు ప్రకటించడంతో టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అధిష్టానికి కూడా ఎమ్మెల్యే, ఎంపీ చేరో పేరును ప్రతిపాదించారు. దీనిపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నిన్నటి నుంచి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న తంగిరాల సౌమ్య.. సత్యవతిని మున్సిపల్ చైర్మన్‌గా చేయాలని అధిష్టానానికి వినతి చేశారు. అలాగే స్వర్ణలతను చైర్మన్‌గా చేయాలని ఎంపీ ప్రతిపాదించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరువురితో అధిష్టానం చర్చించినప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదు. నిన్న సభ్యులు కూడా ఎన్నికకు రాకపోవడంతో కోరం లేక ఎన్నిక నేటికి వాయిదా పడింది. ఈరోజు ఉదయం నుంచి అధిష్టానం జోక్యం చేసుకుని ఎంపీ, ఎమ్మెల్యే ప్రతిపాదించిన పేర్లు కాకుండా మరోపేరును తెరపైకి తీసుకొచ్చింది.మండవ కృష్ణకుమారిపేరును ప్రస్తావించింది అధిష్టానం. దీనిపై ఎమ్మెల్యే సౌమ్యతో మంత్రి నారాయణ చర్చలు జరిపారు. అందరూ కూడా పార్టీ కోసం పనిచేయాలని కృష్ణకుమారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని సూచించారు. అయితే ఏకగ్రీవం అవుతుందని అందరూ అనుకున్నప్పటికీ వైసీపీ అనూహ్యంగా లక్ష్మీ అనే అభ్యర్థిని పోటీకి దింపింది. దీంతో ఓటింగ్ తప్పనిసరైంది. ఎన్నికల అధికారి పోలింగ్ నిర్వహించగా మొత్తం టీడీపీ, జనసేనకు చెందిన 15 మంది మండవ కృష్ణకుమారికి మద్దతు తెలుపగా.. వైసీపీకి సంబంధించి ఐదుగురు ఉన్నప్పటికీ కేవలం ముగ్గురు మాత్రమే ఓటింగ్‌లో పాల్గొన్నారు. చివరగా 15 మంది మద్దతుదారులతో మండవ కృష్ణకుమారి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com