విశాఖ స్టీల్ ప్లాంట్కు రూ.12వేల కోట్ల నిధులు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు.కేంద్ర భారీపరిశ్రమల మంత్రి హెచ్డీ కుమారస్వామిని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అక్కడే ఉన్న ఆయన తండ్రి, మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవనానికి సుమారు రూ.12వేల కోట్ల నిధులు విడుదల చేసినందుకు కుమారస్వామికి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ప్రజల సెంటిమెంట్ తో పాటు వేలాదిమంది కార్మికుల ఆందోళన, మనోభావాలను అర్థం చేసుకుని పెద్దమనసుతో సహకారం అందించారని కొనియాడారు. స్టీల్ ప్లాంట్ ను సందర్శించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడం, ఉత్పాదకత పెంపుదలకు చర్యలు చేపట్టడం, కార్మికుల సమస్యలను నేరుగా తెలుసుకోవడంలో మీ చొరవ శ్లాఘనీయమని అన్నారు. అనకాపల్లి వద్ద ప్రైవేటురంగంలో ఏర్పాటుకానున్న ఆర్సెలర్స్ మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్స్ ఉక్కు పరిశ్రమ వల్ల ఏపీ యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయని మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం తరపున అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కోరారు.