ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హర్యానాలో ఆప్ కొట్టిన దెబ్బకు.. ఢిల్లీలో లెక్క సరిచేసిన కాంగ్రెస్

national |  Suryaa Desk  | Published : Sat, Feb 08, 2025, 08:40 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మింగుడుపడని ఫలితాలు వచ్చాయి. ఆ పార్టీని ఢిల్లీ ఓటర్లు తిరస్కరించారు. ఇక, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన హస్తం పార్టీ.. ఓట్ల పరంగా మూడోస్థానానికి పరిమితమైంది. అయితే, ఢిల్లీలో ఆప్ ఓడిపోవడానికి ఓ విధంగా కాంగ్రెస్ కారణమైంది. అన్ని చోట్ల ఆ పార్టీ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి.. ఆప్ విజయవకాశాలకు గండికొట్టింది. గతేడాది అక్టోబరులో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ దెబ్బకొడితే.. ఢిల్లీలో కాంగ్రెస్ దానిని సరిచేసింది. హర్యానాలో కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకున్న కేజ్రీవాల్‌కు.. ఢిల్లీ ఎన్నికల్లో లెక్క సరిచేసింది. పంజాబ్ సరిహద్దు జిల్లాల్లోని హర్యానా అసెంబ్లీ స్థానాల్లో 12 చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఆప్ అభ్యర్ధులే కారణం. దీంతో పదేళ్ల తర్వాత అధికారంలోకి వస్తారనుకున్న కాంగ్రెస్ నేతల ఆశలు అడియాశలయ్యాయి.


హర్యానాలో కాంగ్రెస్ పార్టీదే విజయమని అన్ని సర్వేలు ఢంకా బజాయించాయి. కానీ, తుది ఫలితాల్లో కాంగ్రెస్ మరోసారి ప్రతిపక్షంతోనే సరిపెట్టుకుంది. మొత్తం 90 స్థానాలున్న హర్యానాలో కాంగ్రెస్‌కు 37 సీట్లు రాగా.. బీజేపీ 50 స్థానాల్లో గెలిచి అధికారం నిలబెట్టుకుంది. ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ గెలుపునకు, ఆప్ ఓటమికి కారణం కాంగ్రెస్ అభ్యర్థులే. ఆయా నియోజకవర్గాల్లో ఆప్ 3 వేలలోపు ఓట్లతో ఓడిపోయారు. ఆ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 5 నుంచి 6 వేల వరకు ఓట్లను చీల్చారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సైతం ఈ విధంగా ఓడిపోవాల్సి వచ్చింది. అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీచేసిన ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దాదాపు 7 వేల ఓట్లు సాధించారు. దీంతో కేజ్రీవాల్‌పై బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ 3 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.


ఇక, లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆప్.. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా ముందుకెళ్లింది. ఇదే సమయంలో ప్రతిపక్ష కూటమి భాగస్వామ్య పక్షాలుగా ఉన్న ఎస్పీ, టీఎంసీ సహా మరికొన్ని పార్టీలు ఆప్‌కు మద్దతు ప్రకటించాయి. ఢిల్లీలో ఆప్ గెలిస్తే..కాంగ్రెస్ లేని మరో కూటమిని ఏర్పాటు చేసి, దానికి నాయకత్వం వహించాలనేది కేజ్రీవాల్ ఆలోచనగా తెలుస్తోంది. కానీ, ఢిల్లీలో ఆప్ గెలిస్తే తమ రాజకీయ భవిష్యత్తుకు మరింత ఇబ్బందుల్లో పడుతోందని గ్రహించిన కాంగ్రెస్.. తాము గెలవకున్నా.. ఆప్ ఓడిపోవాలనే లక్ష్యంతో పనిచేసినట్లు సమాచారం. ఒకే దెబ్బకు కాంగ్రెస్ రెండు పిట్టలను కొట్టినట్టయ్యింది. అటు హర్యానా ఎన్నికల్లో ఓటమి బదులు.. ఇటు ఇండియా కూటమి పగ్గాలు చేజారకుండా ఒడిసిపట్టునట్టయ్యింది.


ఆప్ ఓడిపోతే కేజ్రీవాల్‌ సహా ఇండియా కూటమిలోని మిగతా పక్షాలు కాంగ్రెస్ నేతృత్వంలో నడిచే అవకాశం ఉంది. ఢిల్లీ ఎన్నికల్లో ఖాతా తెరవకపోయినా ఆప్‌ను ఓడించాలనే విషయంలో మాత్రం కాంగ్రెస్ గెలిచినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, కాంగ్రెస్, ఆప్‌లు విడివిడిగా పోటీచేసి.. నష్టపోాయాయి. ఇదే విషయాన్ని జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సైతం ఎత్తిచూపారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ.. మనం మనం కొట్టుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని రెండు పార్టీలకు చురకలు వేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com