ముందుగా చెప్పినట్లుగానే దిగ్గజ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ.. తన రెండో కుమారుడు జీత్ అదానీ పెళ్లిని నిరాడంబరంగా నిర్వహించారు. శుక్రవారం రోజు.. గుజరాత్ అహ్మదాబాద్లోని అదానీ టౌన్షిప్లో పలువురు బంధుమిత్రుల నడుమ చాలా సాదాసీదాగా వివాహం జరిగింది. గుజరాత్ డైమండ్ మర్చంట్ జైమిన్ షా కుమార్తె అయిన దివా జైమిన్ షా మెడలో తాళి కట్టారు జీత్ అదానీ. వివాహం జరిగిన తర్వాత.. పెళ్లి ఫొటోలు పంచుకుంటూ గౌతమ్ అదానీ స్వయంగా ట్వీట్ చేశారు. గుజరాతీ, జైన్ సంప్రదాయాలతో.. కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో సింపుల్గా వివాహం నిర్వహించామని అన్నారు. అందరు శ్రేయోభిలాషుల్ని ఆహ్వానించలేకపోయినందుకు క్షమాపణలు చెప్పారు.
అయితే.. తన కుమారుడి వివాహం వేళ గౌతమ్ అదానీ తన ఉదారగుణాన్ని మరోసారి చాటుకున్నారు. కుమారుడికి పెళ్లి గిఫ్ట్గా.. సమాజానికి సేవ చేసేందుకు నడుం బిగించారు. ఏకంగా రూ. 10 వేల కోట్లను విరాళంగా ప్రకటించినట్లు తెలిసింది. దీనిపై పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. దీనిని వివిధ సామాజిక కారణాల కోసం ఉపయోగించనున్నట్లు గౌతమ్ అదానీని ఉటంకిస్తూ పేర్కొన్నాయి. అయితే అదానీ నేరుగా పెళ్లి సమయంలో ప్రకటన చేసినట్లు కొన్ని మీడియాల్లో వచ్చింది.
ఇక అదానీకి అత్యంత సన్నిహిత వ్యక్తి ఈ విషయం చెప్పినట్లు మరి కొన్ని రిపోర్టులు వెల్లడించాయి. ' సామాన్య ప్రజలకు పలు విధాలుగా ఉపయోగపడేలా పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వాలని అదానీ నిర్ణయించుకున్నారు.' అని ఆయన అన్నట్లు ఉటంకించాయి. పేరు బయటకు చెప్పడానికి ఇష్టపడని ఆయన మాటల ప్రకారం.. 'ఈ విరాళంలో పెద్ద మొత్తం ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి భారీ మౌలిక సదుపాయాల కార్యక్రమాలకు నిధులు సమకూర్చాలని భావిస్తున్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో వరల్డ్ క్లాస్ హాస్పిటల్స్లో వైద్యం, టాప్ స్కూళ్లలో విద్య, నైపుణ్యాలు అందించండపై దృష్టి సారించారు.'
అయితే ఈ పెళ్లికి ముందు జీత్ అదానీ కూడా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఏటా 500 మంది దివ్యాంగ మహిళలకు వారి పెళ్లి నిమిత్తం ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున అందించనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని వివరిస్తూ స్వయంగా అదానీనే ట్వీట్ చేశారు.
మహా కుంభమేళాకు గత నెలలో వెళ్లిన సమయంలోనే.. ఫిబ్రవరి 7న జీత్ అదానీ- దివా పెళ్లి జరుగుతుందని.. సింపుల్గా నిర్వహిస్తామని చెప్పారు. సెలబ్రిటీల్ని ఆహ్వానించి అంగరంగ వైభవంగా చేస్తారన్న ఊహాగానాలకు దీనితో తెరపడింది. చెప్పినట్లుగానే నిరాడంబరంగానే వివాహం జరిపించినట్లు తెలుస్తోంది.