ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల మండిపడ్డారు. తిరుపతికి చెందిన జనసేన నాయకుడు కిరణ్ రాయల్ లక్ష్యంగా శ్యామల ఘాటుగా విమర్శలు గుప్పిస్తూ.. నేరుగా తన విమర్శల పదును పవన్ వైపు మళ్లించారు. అధికారంలోకి రాకముందు పవన్ ఎన్నో మాటలు చెప్పారని, ఇప్పుడు సైలెంట్ అయ్యారని శ్యామల విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శ్యామల మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ మోసం చేశారంటూ లక్ష్మి అనే మహిళ కన్నీటితో విలపిస్తుంటే కూటమి ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. లక్ష్మి నుంచి తీసుకున్న డబ్బుతోనే కిరణ్ రాయల్ జనసేన సభలను నిర్వహించడం వల్లే జనసేన నాయకత్వం ఈ విషయంలో అతడికి అండగా నిలుస్తోందని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తానన్న వారు ఎక్కడున్నారని నిలదీశారు. ''ఆడపిల్లల జోలికొస్తే తొక్కిపెట్టి నార తీస్తాం... నడుం వంచి దెబ్బలు కొడతాం అన్న పవన్ కల్యాణ్... ఏది ఇప్పుడేం అయింది... ఇప్పుడు తొక్క లేదు... నార లేదు...'' అని శ్యామల విమర్శలు గుప్పించారు.
''కిరణ్ రాయల్ వల్ల తనకు అన్యాయం జరిగిందని లక్ష్మి అనే మహిళ కన్నీటితో న్యాయం కోసం కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంది. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా తాను అక్కడ ఉంటాను అని చాటుకునే డిప్యూటీ సీఎం తమ పార్టీ నాయకుడు చేసిన అన్యాయంపై స్పందిస్తారని ఆశ పెట్టుకుంది. ఆమెకు న్యాయం జరగకపోగా కిరణ్ రాయల్ తన పలుకుబడిని ఉపయోగించి జైపూర్ నుంచి పోలీసులను దింపి బాధిత మహిళను జైలుకు పంపడం విస్మయం కలిగిస్తోంది. అసలు ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత ఉందా అనే సందేహాలు కలుగుతున్నాయి. కోటిరూపాయలకు పైగా నగదు, బంగారంను తీసుకుని జనసేన పార్టీ కార్యకలాపాలను కిరణ్ రాయల్ వినియోగించారని.. తాను జనసేన నుంచి పోటీ చేసి గెలుస్తాను, తిరిగి ఆ సొమ్మును చెల్లిస్తానంటూ బాధిత లక్ష్మిని నమ్మించి మోసం చేసిన వైనంను బాధితురాలు కన్నీటితో మీడియా ముందు వెల్లడించడం రాష్ట్ర ప్రజలు చూశారు. ఎన్నిసార్లు తన సొమ్ము కోసం అడిగినా కిరణ్ రాయల్ స్పందించకపోగా, బాధితురాలిపైనే దౌర్జన్యం చేయడంతో దిక్కులేక న్యాయం కోసం పోలీసులను లక్ష్మి ఆశ్రయించింది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందునే కిరణ్ రాయల్ పై కనీసం పోలీసులు ఫిర్యాదు కూడా తీసుకునేందుకు నిరాకరించారు. ఇదేనా కూటమి పాలనలో బాధితులకు జరిగే న్యాయం? ఆడబిడ్డలకు అండగా ఉంటాను అంటూ ఆవేశంతో ప్రసంగాలు చేసిన వారు తనకు న్యాయం చేస్తారని నమ్మిన లక్ష్మి మీడియా ద్వారా జరిగిన విషయాన్ని వెల్లడిస్తే, ఆమెకు న్యాయం చేయకపోగా ఏకంగా జైలుకు పంపినా ఎందకు మౌనంగా ఉన్నారు?'' అని శ్యామల ప్రశ్నించారు.
![]() |
![]() |