మాఘ పౌర్ణమి పుణ్యస్నానాలకు విశాఖ జిల్లాలోని సముద్ర తీరంలో పలుచోట్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అచ్యుతాపురం మండలం పూడిమడక, ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం, పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం, రాంబిల్లి మండలం వాడపాలెం, తదితర ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం తీర్థమహోత్సవాలు ప్రారంభం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాత్రికి ఇక్కడే జాగారం చేసి, తెల్లవారుజాము నుంచి సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అనంతరం సమీపంలోని ఆలయాల్లో స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేస్తారు. పుణ్యస్నానాలు ఆచరించే ప్రదేశాల వద్ద ఆయా శాఖల అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సముద్ర తీరంలో గజ ఈతగాళ్లను నియమించారు. డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ తుహిన్ సిన్హా, డీఎస్పీలు పూడిమడకను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. స్థానిక పోలీసులకు పలు సూచనలు చేశారు.
![]() |
![]() |