ముమ్మిడివరం 4వ వార్డులో ఉన్న డంపింగ్ యార్డును 8వ వార్డు సూరాయిచెరువులోకి మార్పు చేసే ఆలోచన పట్ల ఆ గ్రామ ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆ గ్రామ ప్రజలు మంగళవారం కలెక్టర్ ఆర్.మహేష్కుమార్కు మెమొరాండం ఇచ్చారు. ముమ్మిడివరం నగర పంచాయతీకి సంబంధించిన చెత్తను 4వ వార్డులో కొత్తలంక రోడ్డు పక్కన ఉన్న డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అయితే అక్కడ చెత్త వేయడం వల్ల ఆ చుట్టుపక్కల నివాసం ఉన్నవారికి ఆ రోడ్డులో రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో డంపింగ్ యార్డును ఊరికి దూరంగా ఏర్పాటు చేయడానికి ఎనిమిది ఎకరాలు భూమి అవసరమని రెవెన్యూశాఖను నగర పంచాయతీ కోరింది.
ఇప్పటివరకు అనుకూలమైన భూమి లభించలేదు. అయితే డంపింగ్ యార్డుకు సోమిదేవరపాలెం, సూరాయిచెరువులో ఉన్న నాలుగు ఎకరాల 81 సెంట్ల భూమిని ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఒక రైతు ముందుకు వచ్చాడు. అయితే ఆ భూమిని సేకరించేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. ఆ స్థలం వద్ద 8, 9వార్డులకు సంబంధించి 300మంది ప్రజలు, అయినాపురానికి చెందిన వంద మంది కూడా ఆ ప్రాంతంలోనే నివాసం ఉంటున్నారు. డంపింగ్ యార్డును ఏర్పాటుచేస్తే మరింత ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, డంపింగ్ యార్డును ఊరికి దూరంగా, నివాస గృహాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ఆ గ్రామానికి చెందిన సానబోయిన త్రినాథరావు, చెల్లి మహలక్ష్మి, కె.కృష్ణమూర్తి, కె.సురేష్, కేబీఆర్ మూర్తి, కేబీటీఎస్ఎస్ మీనాక్షి, కె.సురేష్, బి.పరమేశ్వరరావు, చెల్లి శ్రీరామమూర్తి, సీహెచ్ సత్యనారాయణ, సీహెచ్ లోవరాజు, సీహెచ్ శ్రీను, చెల్లి వెంకటేశ్వరరావు, జి.ప్రసాద్ తదితరులు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.
![]() |
![]() |