తమిళనాడులో రాజకీయాలు రసోత్తరంగా మారనున్నాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా తమిళగ వెట్రి కళగం- టీవీకే పార్టీ పెట్టిన హీరో విజయ్.. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే తమ పార్టీ జెండాను, అజెండాను ప్రకటించిన దళపతి విజయ్.. పార్టీ నిర్మాణంపై దృష్టిసారించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్నికల వ్యూహకర్త, జన్సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యారు. ప్రశాంత్ కిషోర్, విజయ్ సమావేశం అయి.. అనేక విషయాలపై చర్చించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం పార్టీ విజయం సాధించేందుకు విజయ్కి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు అందించనున్నారు. ఈ నేపథ్యంలోనే టీవీకే పార్టీకి ప్రత్యేక సలహాదారుడుగా ఉండనున్నారు. ఈ సందర్భంగా తన మద్దతు, మార్గదర్శకత్వం అందిస్తానని విజయ్కి ప్రశాంత్ కిషోర్ హామీ ఇచ్చారు.
సోమవారం చెన్నైలో వీరిద్దరూ 3 గంటల పాటు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల వ్యూహాలకు సంబంధించి తన అనుభవాన్ని ప్రశాంత్ కిషోర్ విజయ్కి వివరించారు. తమిళనాడులో, దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ప్రశాంత్, విజయ్ చర్చించారు. టీవీకేకు ప్రత్యేక సలహాదారుడిగా ప్రశాంత్ కిషోర్ ఉండనుండగా.. వీరి మధ్య ఎలాంటి ఒప్పందాలు జరగలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తరఫున పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఉన్న ప్రశాంత్ కిషోర్.. ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి కావడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో తమిళనాడులో 10 ఏళ్ల తర్వాత డీఎంకే అధికారాన్ని చేపట్టింది.
2026 తమిళనాడు ఎన్నికల్లో అధికార డీఎంకే, ప్రతిపక్ష బీజేపీలకు వ్యతిరేకంగా గట్టి రాజకీయ శక్తిగా నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తున్న టీవీకే.. అందుకోసం రాబోయే రోజుల్లో ప్రశాంత్ కిషోర్తో విజయ్.. మరిన్ని సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్.. జన్సురాజ్ పార్టీని స్థాపించి.. ఈ ఏడాది జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే గతేడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీకి సలహాదారుడిగా ఉన్నట్లుగానే.. తమ పార్టీకి కూడా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తారని.. టీవీకే వర్గాలు చెబుతున్నాయి.
టీవీకే పార్టీలోని వ్యూహకర్తలు అయిన టీవీకే ఎన్నికల ప్రచార నిర్వహణ జనరల్ సెక్రటరీ ఆదవ్ అర్జున.. దళపతి విజయ్కి వ్యూహకర్తగా ఉన్న జాన్ ఆరోకియసామిలకు ప్రశాంత్ కిషోర్ మార్గనిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. వాయిస్ ఆఫ్ కామన్స్ వ్యవస్థాపకుడు, రాజకీయ వ్యూహకర్త అయిన ఆదవ్ అర్జున.. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకే గెలుపు కోసం ప్రశాంత్ కిషోర్తో కలిసి పనిచేశారు. అయితే తమిళనాడు రాజకీయాల గురించి కొన్ని సంవత్సరాల క్రితమే ప్రశాంత్ కిషోర్, దళపతి విజయ్ మధ్య చర్చలు జరిగాయి. అయితే రాజకీయాల్లోకి రావడానికి విజయ్ కొంత సమయం తీసుకోవడం.. అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ జన్సురాజ్ పార్టీని స్థాపించడంతో వీరిద్దరి మధ్య సమావేశాలు వాయిదా పడ్డాయని టీవీకే పార్టీ వర్గాలు తెలిపాయి.
![]() |
![]() |