ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ధైర్యంతోనే బతికేస్తున్నా..: మార్క్ జుకర్‌బర్గ్

international |  Suryaa Desk  | Published : Wed, Feb 12, 2025, 10:38 PM

మెటా సీఈఓ, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు అయిన మార్క్ జుకర్‌బర్గ్‌ తాజాగా షాకింగ్ కామెంట్లు చేశారు. ఇటీవలే జో రోగన్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న జుకర్‌బర్గ్‌.. ఎవరో ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు కారణంగా పాకిస్థాన్ తనకు మరణశిక్ష విధించాలని చూస్తున్నట్లు వివరించారు. ఈ కేసు అంత వరకూ వెళ్లినా తాను ధైర్యంగా ఉండడానికి కారణం.. తాను ఆ దేశంలో లేకపోవడమేనని చెప్పుకొచ్చారు. అలాగే పాకిస్థాన్‌లో ఫేస్‌బుక్ సంస్థపై నమోదు అయిన దావా గురించి వివరించారు. ఆ పూర్తి సమాచారం మీకోసం.


ఇటీవలే జో రోగన్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మార్క్ జుకర్‌బర్గ్‌.. అనేక దేశాల్లో మనం ఏమాత్రం అంగీకరించని చాలా చట్టాలు ఉన్నాయని చెప్పారు. పాకిస్థాన్‌లో తనకు మరణ శిక్ష విధించాలంటూ ఎవరో దావా వేశారని వెల్లడించారు. ఫేస్‌బుక్‌లో ఎవరో దేవుడిని అవమానిస్తున్న ఫొటోలను పోస్టు చేయడమే అందుకు కారణం అని తెలిపారు. అయితే ఆ కేసు ఎక్కడి వరకు వెళ్తుందనేది తనకు తెలియదని.. కానీ మరణశిక్ష పడే అవకాశం కూడా ఉండొచ్చని పేర్కొన్నారు.


అది కాస్త భయం కల్గించే విషయమే అయినా తాను భయపడకుండా ధైర్యంగా ఉండాడనికి మాత్రం ఓ కారణం ఉందన్నారు. తనకు ఆ దేశానికి వెళ్లాలని లేదని.. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు వివిధ దేశాల్లో పాటించే సాంస్కృతిక విలువలపై నిబంధనలు ఉన్నాయన్నారు. దీంతో యాప్‌లోని చాలా కంటెంట్‌ను అణిచివేయాల్సి వస్తోందన్నారు. ఆయా దేశాల ప్రభుత్వాలు సైతం కంపెనీల యజమానులను కూడా జైల్లో వేసేంత శక్తివంతంగా ఆ నిబంధనలు ఉంటాయన్నారు.


వివిధ దేశాల్లో ఉన్న అమెరికన్ టెక్ కంపెనీలను రక్షించడంలో.. అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వ సాయం అందించాలని తాను కోరుకుంటున్నట్లు మార్క్ జుకర్‌బర్గ్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. పాకిస్థాన్ 2024 ప్రారంభంలోని ఎక్స్, ఫేస్ బుక్ సహా అనేక సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించింది. ముఖ్యంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు.. వీటిని ఉపయోగిస్తూనే తమ దేశానికి వ్యతిరేకంగా వార్తలను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించింది. వాటిని అడ్డుకోవడంలో భాగంగానే వాటిని నిషేధించినట్లు తెలిపింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com