తిరుమల శ్రీవారి సేవకు సంబంధించిన టోకెన్లలో మోసం వెలుగు చూసింది. కృష్ణారావు అనే వ్యక్తి హైదరాబాద్కు చెందిన 14 మంది భక్తులను మోసం చేశారు. ఒక్కొక్కరి నుంచి 800 రూపాయలు చొప్పున వసూలు చేశారు. హైదరాబాద్కు చెందిన కొంతమంది తిరుమల శ్రీవారికి సేవ చేయాలని అనుకున్నారు. శ్రీవారి సేవ కోసం టికెట్లు బుక్ చేసుకునే ప్రయత్నం చేయగా.. బుక్ కాలేదు. దీంతో కృష్ణారావు అనే వ్యక్తిని ఆశ్రయించారు. అయితే తిరుమలకు వచ్చిన తర్వాత కానీ వారికి అసలు నిజం బోధపడలేదు. తిరుమలకు వచ్చిన తర్వాత శ్రీవారి సేవ ఉచితమని వారికి తెలిసింది. దీంతో శ్రీవారి సేవ కోసం తమ వద్ద నుంచి కృష్ణారావు అనే వ్యక్తి రూ.800 చొప్పున వసూలు చేశారంటూ టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదుతో కృష్ణారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణారావు శ్రీవారి సేవ టోకెన్లు, ఇతర దర్శన టికెట్లు కూడా భక్తులకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో నలుగురు అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతోంది. అందులో భాగంగానే నలుగురు నిందితులను అరెస్ట్ చేసింది. వీరికి తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో శుక్రవారం వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ కేసులో భోలేబాబా డెయిరీ మాజీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్, ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్, శ్రీవైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్కాంత్ చావ్డాను సిట్ అరెస్ట్ చేసింది. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు ఐదురోజులు సిట్ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ నేపథ్యంలోనే ఈ నలుగురు నిందితులకు శుక్రవారం ఉదయం రుయా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం తిరుపతిలోని సిట్ కార్యాలయానికి తరలించారు. కస్టడీ సమయంలో సిట్ అధికారుల బృందం వీరిని విచారించనుంది. పలు అంశాలపై వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయనుంది. ఫిబ్రవరి 18వ తేదీతో నలుగురి కస్టడీ ముగియనుంది. మరోవైపు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. ఈ బృందంలో సీబీఐ అధికారులు, రాష్ట్ర పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారి సభ్యులుగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa