మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకూ శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు, అధికారులు తరలి రానున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీశైలం దేవస్థానం అన్నిరకాల ఏర్పాట్లు చేస్తోంది.
అందులో భాగంగా భక్తుల ఆకలి తీర్చేందుకు అన్న ప్రసాదం పంపిణీ చేయనుంది. అన్నపూర్ణ భవన్లోని హాల్-1, హాల్-2లలో శివ భక్తులకు, సాధారణ భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేయనున్నారు. మూడో నంబర్ హాలులో పోలీసులకు, నాలుగు, ఐదో నంబర్ హాళ్లల్లో కళాకారులు, వీఐపీలకు భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 వరకు అన్న ప్రసాదం పంపిణీ జరగనుంది. అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ అన్న ప్రసాదం అందజేస్తారు.
భక్తులకు అందించే అన్న ప్రసాదంలో సాంబారన్నం, పెరుగన్నంతో పాటుగా ఒక స్వీటు ఉండనుంది. శివ దీక్షలు చేపట్టి వచ్చే వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం సాంబారన్నం, పెరుగన్నం, రాత్రికి ఉప్మా వడ్డించేలా శ్రీశైలం దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే కంపార్ట్మెంట్లలోని భక్తులకు అల్పాహార ప్రసాదంగా పులిహోర, పొంగళి, పెరుగన్నం, సాంబారన్నం,జీరా అన్నం, టమాటబాత్ వడ్డిస్తారు. మంచినీరు, చిన్న పిల్లలకు పాలు అందించేలా ఏర్పాట్లు చేశారు.
మరోవైపు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక లడ్డూ అందించాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశం మేరకు శ్రీశైలం దేవస్థానం చర్యలు ప్రారంభించింది. ప్రతి భక్తుడికి 50 గ్రాముల బరువుండే లడ్డూను ఉచితంగా ఇవ్వనున్నారు. ఇందుకోసం మొత్తం 4 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నారు. ఫిబ్రవరి 24 నుంచి 27వ తేదీ వరకు భక్తులకు ఉచితంగా లడ్డూలు అందజేస్తారు.
మరోవైపు లడ్డూ ప్రసాదాల తయారీని శనివారం ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలోని పోటులో లడ్డూల తయారీకి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాల కోసం మొత్తం 35 లక్షల లడ్డూలను తయారు చేయనున్నారు. రోజుకు 2 లక్షల నుంచి 4 లక్షల లడ్డూలు తయారు చేయనున్నారు. 100 గ్రాముల లడ్డూ రూ.20 చొప్పున కౌంటర్ల ద్వారా విక్రయిస్తారు. లడ్డూ కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించడానికి ప్రైవేట్ సత్రాల వద్ద కూడా లడ్డూ విక్రయాలు జరపాలని దేవస్థానం నిర్ణయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa