జగిత్యాల జిల్లా మద్దులపల్లికి చెందిన కంబాల హారిక, తిరుపతి దంపతులు. వీటికి తొమ్మిదేళ్ల కుమారుడు కృష్ణాంత్, 8 ఏళ్ల కుమార్తె మాయంతలక్ష్మి ఉన్నారు. అయితే.. ఈనెల 14న సాయంత్రం పిల్లలిద్దరికీ గడ్డి మందు తాగించి.. తానూ తాగేసి హరిక ఆత్మహత్య చేసుకుంది. అయితే.. కుటుంబ సభ్యులు గమనించి.. హారికను, పిల్లలను హుటాహుటన ఆస్పత్రికి తరలించగా.. హరిక ఆరోజు రాత్రే చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే.. ఇద్దరు పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఉండగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. ఇద్దరు చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఫిబ్రవరి 16న) ప్రాణాలు కోల్పోయారు.
అయితే.. హరిక ఇంత ఘోరానికి ఎందుకు ఒడిగట్టింది అన్న విషయానికి రకరకాల కారణాలు చెప్తున్నారు. హరిక, తన ఇద్దరు పిల్లల మృతికి భర్త తిరుపతే కారణమని ఆమె పుట్టింటివాళ్లు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒగ్గు కళాకారునిగా జీవనం సాగిస్తున్న తిరుపతికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని.. హారిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 12 ఏళ్ల క్రితం తిరుపతికి హారికతో వివాహం కాగా.. ఇద్దరు పిల్లలు పుట్టిన ఇన్ని రోజుల తర్వాత.. వరకట్నం కోసం వేధించటమే కాకుండా.. మరో మహిళను ఇంటి వరకూ తీసుకురావటం వల్లే మనస్తాపంతో హరిక ఈ దారుణానికి ఒడిగట్టినట్టు ఆరోపిస్తున్నారు. అయితే.. ఆత్మహత్యకు ముందు భర్తకు వీడియో కాల్ చేసి మరీ చనిపోయిందని పుట్టింటివారు చెప్తున్నారు. హారిక ఇద్దరు పిల్లల మృతికి కారణమైన భర్త తిరుపతిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. భార్య ఇద్దరు పిల్లలు చనిపోయాక.. ఇక తానెందుకు బతకాలంటూ తిరుపతి బోరున విలపించాడు. కాగా.. హారిక పుట్టింటి వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెగడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్యకు ముందు తిరుపతికి వీడియో కాల్ చేసినట్టుగా ఆరోపిస్తుండటంతో ఇద్దరి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వేధింపులు, క్షణికావేశంతోనే ఈ దారుణం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa