అనకాపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలు సోలార్ బయోమాస్ హైబ్రిడ్ బెల్లం తయారీ యూనిట్ను రూపొందించారు. ఆధునిక బెల్లం పరిశోధనా ప్రాజెక్టులో ఇదొక మైలురాయిగా చెప్పొచ్చు. ఈ హైబ్రిడ్ బెల్లం తయారీ యూనిట్లో సౌరశక్తిని ఉపయోగించి చెరకు క్రషింగ్, బయోగ్యాసీఫెయిర్తో చెరకు రసాన్ని మరిగించడం అనే రెండు పద్ధతులు ముఖ్యమైనవి. ఈ రెండింటిని రూపొందించడమే కాకుండా వీటిని ప్రామాణీకరించామని పోస్ట్ హార్వెస్టు టెక్నాలజీ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పీవీకే జగన్నాథరావు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సోలార్ బయోమాస్ హైబ్రిడ్ విధానంలో బెల్లం తయారీ వల్ల సమయం, డబ్బు, శ్రమ ఆదా అవడమేకాక నాణ్యమైన బెల్లం ఉత్పత్తి అవుతుందని చెప్పారు. చెరకు రసాన్ని మరిగించేటప్పుడు వెలువడే కర్బన్ ఉద్గారాలు బయోగ్యాసీఫెయిర్ వల్ల తగ్గిపోయి, పర్యావరణానికి మేలు చేస్తాయని వివరించారు.బెల్లం తయారు చేసే రైతులు ఇప్పటి వరకు విద్యుత్ మోటార్లతో చెరకు క్రషింగ్ చేస్తున్నారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం తొమ్మిది గంటలపాటు మాత్రమే త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నది. అంతేకాక వివిధ కారణాల వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోతూ వుంటుంది. అప్పటి వరకు తీసిన చెరకు రసం ఒక బెల్లం పాకం తయారీకి చాలకపోతే మళ్లీ కరెంటు వచ్చే వరకు వేచివుండాల్సి వుంటుంది. దీంతో చెరకు రసం పులిసిపోతుంది. ఇటువంటి రసంతో తయారైన బెల్లం నాణ్యతలోపిస్తుంది. ఇందుకు ప్రతిగా విద్యుత్ క్రషర్కు 28 ప్యానళ్ల సౌరశక్తి కనెక్షన్ ఇచ్చినట్టయితే అంతరాయం లేకుండా చెరకును క్రషింగ్ చేయవచ్చు. సౌరశక్తిని వినియోగించుకోవడం వల్ల విద్యుత్ చార్జీలు 60 శాతం వరకు ఆదా అవుతాయి. 28 ప్యానళ్ల సౌరశక్తితో ఏడు హెచ్పీ వరకు మోటార్లు పనిచేస్తాయని జగన్నాథరావు చెప్పారు. సోలార్ విద్యుదుత్పత్తి యూనిట్లకు ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa