కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను మూడోసారి టీడీపీ అడ్డుకోవడంతో వాయిదా పడింది. టీడీపీ లొంగదీసుకున్న కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి అనుమతించి, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. మున్సిపాలిటీలో 30 వార్డులకుగాను 30 మందీ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరొకరు ఉద్యోగం రావడంతో రాజీనామా చేశారు. మిగిలిన 28 మంది వైఎస్సార్సీపీకి చెందినవారే. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన వైస్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చారు. టీడీపీ ముందస్తు వ్యూహంలో భాగంగా కౌన్సిల్ హాల్లోకి చొరబడి ఎన్నికను అడ్డుకుంది.మరుసటి రోజూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. దీంతో వైఎస్సార్ సీపీకి చెందిన కౌన్సిలర్ కాసే సుమతి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఎన్నిక జరగాల్సి ఉన్నా, టీడీపీ దౌర్జన్యం వల్ల మళ్లీ వాయిదా పడింది. మంగళవారం ఉదయం 11 గంటలకు వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని ఆర్వో రవికుమార్ తెలిపారు. కాగా, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం చైర్పర్సన్ సుధారాణి నివాసం వద్ద నుంచి వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను బలవంతంగా తీసుకువెళ్లేందుకు టీడీపీ నాయకులు యత్నిం చారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అడ్డుకున్నారు.దీంతో టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్, పోలిశెట్టి రామలింగేశ్వరరావులు రాజాపై దాడికి దిగారు. వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ శ్రేణులను పోలీసులు అక్కడ నుంచి బయటకు పంపించి వేశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లతో పోలీసులు సంప్రదింపులు జరిపారు. టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలను పంపించేస్తే ఓటింగ్కు వస్తామని కౌన్సిలర్లు చెప్పారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల వరకు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లక పోవడంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది.ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. టీడీపీకి సొంతంగా ఒక్క సీటు లేకపోయినా అధికార మదంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను లొంగదీసుకోవాలని చూస్తోందని, సంతలో పశువుల్లా కొనాలనుకుంటోందని మండిపడ్డారు. అయినా మెజార్టీ లేకపోవడంతో పోలీసులను వినియోగించారన్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి భర్త, కో ఆప్షన్ సభ్యుడు ఏలూరి బాలును హౌస్ అరెస్ట్ చేశారని, మరికొందరి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి భయాందోళనలు సృష్టించారన్నారు.మహిళా కౌన్సిలర్లలో గర్భిణులు ఉన్నారని, వారికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు టీడీపీ గూండాలు, రౌడీ షీటర్లకు సహకరించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మంగళవారం చలో తుని కార్యక్రమానికి జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని రాజా పిలుపునిచ్చారు. మున్సిపల్ కౌన్సిలర్ల రక్షణ బాధ్యతను తాను తీసుకుంటానని ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa