జిల్లాకు చెందిన బాపట్ల లోక్సభ సభ్యులు శ్రీరాం మాల్యాద్రిని శాసనసభకు పోటీ చేయించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయంగా బాపట్ల లోక్సభ అభ్యర్థిత్వం కోసం పలువురి పేర్లుని కూడా పరిశీలన చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయమై కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి, ఎంపీ మాల్యాద్రితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా తాటికొండ అసెంబ్లీ అభ్యర్థి ఎంపికలో వచ్చిన సమస్య పరిష్కారానికి ఈ సరికొత్త వ్యూహాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. పోటీచేసే అభ్యర్థుల ఎంపికపైన, అలాగే నియోజకవర్గాలలో చెలరేగే అసంతృప్తులను చల్లార్చే విషయంలోను ముఖ్యమంత్రే ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రకాశం, గుంటూరు జిల్లాల అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికకై ఆయన సమీక్షలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్నిచోట్ల అభ్యర్థుల ఎంపికపై నిజమైన సలహాలను సరికొత్త వ్యూహానికి ఆయన శ్రీకారం పలుకుతున్నారు. అందులో భాగంగా గుంటూరు జిల్లాతో కూడా సంబంధం ఉన్న బాపట్ల ఎంపీ మాల్యాద్రిని వినియోగించుకోవాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమరావతి ప్రాంతంలోని తాటికొండ సిటింగ్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ని, ఆ నియోజకవర్గంలోని కొందరు పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ విషయాన్ని అటు సీఎం, ఇటు పార్టీ రాష్ట్ర నాయకులకు వారు తెగేసి చెప్పారు. ఎస్సీలకు కేటాయించిన ఆ నియోజకవర్గానికి ప్రత్యామ్నాయ అభ్యర్థిని ఆలోచిస్తూ శ్రావణ్ కుమార్కి మరో రూపంలో న్యాయం చేయాలన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సౌమ్యుడిగా, వివాద రహితుడిగా పేరొందిన బాపట్ల ఎంపి శ్రీరాం మాల్యాద్రిని వినియోగించుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకే తాటికొండ అసెంబ్లీ నుంచి మాల్యాద్రిని రంగంలోకి దింపాలన్న ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. ఎంపీ మాల్యాద్రికి గాడ్ఫాదర్గా ఉన్న కేంద్ర మాజీమంత్రి సుజ నా చౌదరితో సీఎం చంద్రబాబు ముందుగా మాట్లాడినట్లు చెప్తున్నారు. అన్నివిధాలా అర్హతలున్న మాల్యాద్రిని తాటికొండ అసెంబ్లీ నుంచి పోటీ చేయిద్దామని సూచించినట్లు తెలిసింది. ఎంపీగానే మాల్యాద్రి పార్టీకి బాగా ఉపయోగపడతాడన్న అభిప్రాయాన్ని సుజ నా చౌదరి వ్యక్తం చేసినట్లు సమాచారం. నిజమే కావచ్చు ప్రస్తుత అవసరాల దృష్ట్యా మనం కొన్ని మార్పులు చేయాలి, మాల్యాద్రికి భవిష్యత్తులో ప్రభుత్వపరంగా కూడా మంచి అవకాశం కల్పిద్దామన్న సంకేతాన్ని కూడా చంద్రబాబు ఇచ్చారని ఆ వర్గాలవారు అంటున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్గానే పరిశీలిస్తుండటంతో ఎంపీ మాల్యాద్రి కూడా తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. బాపట్ల లోక్సభలో తనకు అత్యంత సన్నిహితుడైన శ్రేయోభిలాషులతో ఆయన తాజా ప్రతిపాదనపై అభిప్రాయాలు తెలుసుకుంటున్నట్లు కూడా తెలిసింది.
పార్లమెంటుకి పలు పేర్లు పరిశీలన-
ఇదే సమయంలో బాపట్ల లోక్సభ అభ్యర్థి ఎంపికపై కూడా పలు పేర్లుని టీడీపీ అధిష్టానం పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుత తాటికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ను బాపట్ల లోక్సభ నుంచి రంగంలోకి దించే ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం. అయితే అందుకు ఆయన అంగీకరిస్తాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆయన అంగీకరించని పక్షంలో ఆయనకు ప్రత్యామ్నాయ అవకాశాన్ని చూస్తూనే బాపట్లకు ఎవరిని రంగంలోకి దించాలన్న అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని కొన్ని సర్వేలు కూడా ఆ పార్టీ చేస్తోంది. జిల్లాలో గతంలో కలెక్టర్గా పనిచేసి గత ఎన్నికల సమయంలోనే టీడీపీ టిక్కెట్ ఆశించి భంగపడిన దేవానంద్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పదవీకాలం పొడిగింపు ద్వారా సమాచార కార్యదర్శిగా పనిచేస్తున్న రామాంజనేయులు, వాణిజ్యశాఖ అధిగారిగా పదవీ విరమణ చేసిన ఉప్పులేటి హరిప్రసాద్, అలాగే పదవీవిరమణ చేసిన ఐఆర్ఎస్ అధికారి హరిప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. జిల్లాలోని చీరాలకు చెందిన దివంగత సలగల బెంజిమెన్ కుమారుడు రాజశేఖర్ కూడా బాపట్ల లోక్సభ టిక్కెట్ని ఆశిస్తున్నారు. ఇలా పలు పేర్లుని టీడీపీ పరిశీలనలోకి తీసుకుంది. అయితే తాటికొండ విషయంలో తుది నిర్ణయానికి వచ్చిన తర్వాతే లోక్సభ అభ్యర్థి ఎంపికపై ఒక నిర్ణయానికి రావచ్చని విశ్వసనీయ సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa