ట్రెండింగ్
Epaper    English    தமிழ்

30 ఏళ్ల కిందటి కేసులో దోషిగా తేలిన మహారాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి

national |  Suryaa Desk  | Published : Thu, Feb 20, 2025, 09:47 PM

మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్ రావ్ కొకాటే, ఆయన సోదరుడు సునీల్ కొటాటే.. 30 ఏళ్ల నాటి ఓ మోసం కేసులో దోషిగా తేలారు. ఈక్రమంలోనే నాసిక్ జిల్లా కోర్టు వీరిద్దరికి రెండేళ్ల జైలు శిక్ష వేసింది. అలాగే 50 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. మరి 30 ఏళ్ల క్రితం అన్నాతమ్ముళ్లు ఇద్దరూ కలిసి ఏం నేరం చేశారు, ఎలా ఈ కేసులో ఇరుక్కున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


1955లో నిర్మాణ్ వ్యూ అపార్ట్‌మెంట్‌లో ముఖ్యమంత్రి కోటా కింద కొకాటే సోదరులు రెండు ఫ్లాట్‌లను కొనుగోలు చేశారు. అయితే ఇందుకోసం నకిలీ డాక్యుమెంట్లు సమర్పించడమే కాకుండా.. వారికి వస్తున్న ఆదాయాన్ని చాలా తక్కువగా చూపించారని ఆరోపణలు వచ్చాయి. అసలు తమకు ఇళ్లే లేవని, ఎలాంటి ఆదాయమూ లేదంటూ వారు ఫ్లాట్లు పొందారని చాలా మంది గొడవ చేశారు. దీంతో మాజీ మంత్రి తుకారాం ఢిఘోలే అదే ఏడాది కొకాటే సోదరులు అయిన మాణిక్ రావ్, సునీల్‌లపై కేసు పెట్టారు.


ఈక్రమంలోనే కొకాటే సోదరులపై సెక్షన్లు 420(మోసం), 465(నకలీ పత్రాలు తయారు చేయడం), 471, 474 (సత్యాన్ని దాచడం) వంటి వాటి కింద కేసు నమోదు అయింది. ఆపై అధికారులు దర్యాప్తు చేపట్టగా... చాలా ఏళ్లుగా ఈ కేసు కొనసాగుతూనే వస్తోంది. అయితే గురువారం రోజు నాసిక్ జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. ఈక్రమంలోనే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పూనమ్ ఘోట్కే మాట్లాడుతూ.. ఈ కేసులో మొత్తం 10 మంది సాక్షులను విచారించామని చెప్పారు. కొకాటే సోదరులు నిజంగానే 1997లో ముఖ్యమంత్రి నిధి నుంచి 10 శాతం రిజర్వేషన్ కోటా కింద తప్పుడు పత్రాలతో ఫ్లాట్లు పొందారని వివరించారు.


ఇలా ఇరువురి తరఫు వాదనలు విన్న న్యాయస్థానం కొకాటే సోదరులను దోషులుగా తేల్చింది. అన్నాతమ్ముళ్లిద్దరికీ రెండేళ్ల జైలు శిక్షతో పాటు 50 వేల రూపాయల జరిమానా విధించింది. అంతేకాకుండా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న మరో ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేసింది. అయితే శిక్ష పడిన వెంటనే వీరికి బెయిల్ మంజూరు కాగా.. కోర్టు ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్తున్నట్లు మంత్రి మాణిక్ రావ్ కొటాటే తెలిపారు.


మరోవైపు మంత్రి మద్దతు దారులు స్పందిస్తూ.. కోర్టు తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొకాటే సోదరులపై రాజకీయ నాయకులు ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని.. అందులో భాగంగానే వీరికి శిక్ష పడిందని ఆరోపిస్తున్నారు. ఈ తీర్పుపై తమ మంత్రి త్వరోలనే హైకోర్టుకు వెళ్తారని కూడా చెప్పుకొచ్చారు. చూడాలి మరి ముందు ముందు ఏం జరగనుంది అనేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com