తిరుమల శ్రీవారి కొలువైన కొండ కింద కొత్త దందా నడుస్తోంది. శ్రీవారి మెట్టు నడక మార్గంలో ప్రైవేటు ట్యాక్సీలు, ఆటోవాలాలు భక్తుల్ని నిండా ముంచేస్తున్నారు. దర్శనం టికెట్ల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతి రోజూ వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. అయతే బస్సులు, రైళ్లలో తిరుపతికి చేరుకున్న భక్తులకు టైమ్ స్లాట్ టోకెన్లు ఇప్పిస్తామంటూ కొందరు ఆటోవాలాలు నమ్మిస్తున్నారు. ఒక్కో భక్తుడి నుంచి రూ.500 నుంచి రూ.2వేల వరకు డిమాండ్ చేస్తున్నారు.
తిరుపతిలోని రైల్వేస్టేషన్, బస్టాండు, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల నుంచి భక్తులకు మాయమాటలు చెబుతున్నారు. తిరుపతిలో టైమ్ స్లాట్ టోకెన్లు పొందాలంటే కష్టమని.. తమతో వస్తే శ్రీవారిమెట్టు వద్ద క్షణాల్లో దర్శన టోకెన్లు ఇప్పిస్తామంటున్నారు. భక్తులు నిజమని నమ్మి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తూ శ్రీవారిమెట్టు దగ్గరకు చేరుకుంటున్నారు. ఇక్కడ కాలినడకన వెళ్లే భక్తులకు రోజుకు మూడు వేలు టోకెన్లు మాత్రమే ఇస్తున్నారు. తీరా శ్రీవారి మెట్టు మార్గం దగ్గరకు వెళ్లిన భక్తులు టోకెన్లు అయిపోవడంతో ఉసూరుమంటూ కాలినడకన తిరుమల వెళ్తున్నారు.
టైమ్ స్లాట్ దర్శన టోకెన్ల పేరుతో తిరుపతి నుంచి శ్రీవారిమెట్టుకు ఆటోవాలాలు భక్తుల్ని తరలిస్తున్నారు. ఒక్కో ఆటో డ్రైవర్ 5 లేక 7 మంది భక్తుల బృందం నుంచి రూ.10 వేలకు పైగా వసూలు చేసినట్లు చెబుతున్నారు. శ్రీనివాసమంగాపురం నుంచి శ్రీవారిమెట్టు చేరుకునే ఒక్కో భక్తుడు నుంచి రూ.500 వసూలు చేశారంటున్నారు. దీంతో శ్రీవారిమెట్టు మార్గం దగ్గరకు భక్తుల భారీగ తరలిరావడంతో అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ఆటోలు, కార్లు, బస్సులు భారీగా చేరుకోవడంతో 6 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. మెట్టుమార్గంలో టీటీడీ 3వేల టైమ్ స్లాట్ టోకెన్లు మాత్రమే జారీ చేస్తుండగా.. అక్కడికి 10 వేలకు పైగా చేరుకున్న శ్రీవారి భక్తులు చేరుకున్నారు. అక్కడ కేవలం ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఉండడంతో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమైంది. ఆటో డ్రైవర్లు స్వలాభం కోసం ఇలా చేస్తుంటే.. సామాన్య భక్తులకు తిప్పలు తప్పడం లేదు.
వాస్తవానికి శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టు వద్దకు వెళ్లడానికి ఆర్టీసీ బస్ సర్వీసు ఉంది. ఫ్రీ బస్ సర్వీసు కూడా ఉంది. కానీ, ఆటోవాలాలు చెప్పే మాయమాటలు విని కొందరు ఎక్కువ డబ్బులు చెల్లించి ఆటోలు ఎక్కుతున్నారు. తీరా శ్రీవారి మెట్టు వద్దకు వెళ్లేసరికి ట్రాఫిక్ జామ్. శ్రీవారి మెట్టు వద్ద జారీ చేసే టోకెన్ల సంఖ్య మూడు వేలే కాబట్టి.. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వాహనాలన్నింటినీ ఒకేసారి పంపడం లేదు. శ్రీవారి మెట్టుకు దాదాపు కిలోమీటర్ దూరంలో బారికేడ్లు అడ్డం పెట్టి ఆపుతున్నారు. క్యూలైన్ ఖాళీ అయిన తర్వాత మళ్లీ కొన్ని వాహనాలను వదులుతున్నారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. శనివారం ఉదయం ఇదే పరిస్థితి అక్కడ కనిపించింది. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అరగంటకు పైగా ట్రాఫిక్ను ఆపడంతో.. దివ్య దర్శనం టోకెన్లు ఇప్పిస్తామని నమ్మించి భక్తులను తీసుకొచ్చిన ఆటోవాలాలు.. వాళ్లను అక్కడే దించేసి వెనక్కి వెళ్లిపోతున్నారు. తీరా అక్కడ దిగాక దివ్య దర్శనం టోకెన్లు దొరుకుతాయో లేదో తెలియని పరిస్థితి. 3వేల దివ్య దర్శనం టోకెన్ల కోటా అయిపోతే.. మళ్లీ కొండకు వెళ్లి సర్వదర్శనం చేసుకోవాల్సిందే. మరోవైపు, గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోవడంతో కొంతమంది భక్తులు అసహనానికి గురవుతున్నారు. ఈ విషయంలో టీటీడీ కలుగజేసుకుని ఒక పరిష్కారం ఆలోచించాలని భక్తులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa