ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా అంగరంగా వైభవంగా జరుగుతోంది. నిత్యం కోట్లాదిమంది భక్తులు వచ్చి గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. జనవరి 13వ తేదీన ప్రారంభం అయిన మహా కుంభమేళా ముగింపు దశకు వచ్చింది. ఈనెల 26వ తేదీన మహా శివరాత్రితో మహా కుంభమేళా ముగియనుండగా.. ఇప్పటివరకు 60 కోట్లమంది భక్తులు ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ సర్కార్ వెల్లడించింది. అయితే ఉత్తర్ప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న జైళ్లలోని ఖైదీలకు కూడా కుంభమేళా పుణ్యస్నానాలు చేయించాలని నిర్ణయించుకున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మహా కుంభమేళా నీటిని జైళ్లకే తీసుకువచ్చి ఖైదీలు పుణ్యస్నానాలు చేసేలా చూశారు.
యూపీలోని 75 జైళ్లలో ఉన్న ఖైదీలు త్రివేణీ సంగమంలోని నీటితో పవిత్ర స్నానాలు చేశారని ఉత్తర్ప్రదేశ్ జైళ్ల శాఖ మంత్రి దారా సింగ్ స్పష్టం చేశారు. లక్నోలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. ప్రయాగ్రాజ్ నుంచి పవిత్ర జలాలను రాష్ట్రంలోని 75 జైళ్లకు తీసుకువచ్చి 90 వేల మంది ఖైదీలు స్నానాలు చేసేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు అంతా కుంభమేళాకు తరలివచ్చి స్నానాలు చేస్తుంటే.. యూపీలోని ఖైదీలకు మాత్రం ఆ అవకాశం ఎందుకు కల్పించకూడదని తమ ప్రభుత్వానికి అనిపించిందని.. అందుకే ఖైదీలకు కూడా పుణ్యస్నానాలు చేసే అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా యూపీలోని 75 జైళ్లలో మొత్తం 90 వేల మంది ఖైదీలు ఉన్నారని యూపీ జైళ్ల డైరెక్టర్ జనరల్(డీజీ) పీవీ రామశాస్త్రి తెలిపారు. పవిత్ర సంగమం నుంచి తెచ్చిన జలాలను అన్ని జైళ్లకు పంపించామని.. ఆ నీటిని స్నానాలకు ఉపయోగించే నీటిలో కలిపి.. ఆ తర్వాత డ్రమ్ములలో నింపినట్లు చెప్పారు. అనంతరం ఖైదీలంతా ప్రార్థనలు చేసి, పుణ్యస్నానాలు చేశారని వెల్లడించారు. ప్రయాగ్రాజ్ నుంచి తెచ్చిన అమృత కలశంతో పూజలు చేసిన తర్వాత ఖైదీలు పుణ్యస్నానాలు చేసినట్లు బాగ్పట్ జిల్లా జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రశాంత్ కుమార్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa