ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రమాదంలో తుంగభద్ర, ఇప్పటికి ఏర్పాటుచెయ్యని 19వ నెంబరు క్రస్ట్‌గేటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 24, 2025, 10:36 AM

తుంగభద్ర ప్రాజెక్టు కర్ణాటక, తెలుగు రాష్ట్రాల జీవనాడి. కరువుతో తల్లడిల్లే రాయలసీమకు ప్రాణాధారం. గత ఏడాది ఆగస్టులో వచ్చిన వరదలకు 19వ నెంబరు క్రస్ట్‌గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. సాగునీటి ప్రాజెక్టుల గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలో పది రోజులకుపైగా శ్రమించి ‘స్టాప్‌లాగ్‌ ఎలిమెంట్స్‌’ ఏర్పాటు చేశారు. తరువాత డ్యాంను పరిశీలించిన కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్‌ ఏకే బజాజ్‌ నేతృత్వంలోని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎ్‌సఏ) ‘‘డ్యాం గేట్లు జీవిత కాలం తీరిపోయింది. మరమ్మతులతో కాలయాపన చేయడం సరికాదు. అత్యాధునిక డిజైన్‌తో 33 గేట్లు కొత్తగా ఏర్పాటు చేయడమే ఉత్తమం’’ అని నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను అందుకున్న తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు.. దీనిపై క్రస్ట్‌గేట్ల నిపుణులతో అధ్యయనం చేయించాలని, గత ఏడాది డిసెంబరు ఆఖరులోగా డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌(డీపీఆర్‌) తయారు చేయించాలని నవంబరులోనే నిర్ణయించింది. అయితే.. నెలలు గడిచిపోతున్నా గేట్ల నిపుణులతో అధ్యయనం చేయించలేదు. కనీసం కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో కొత్త గేటు ఏర్పాటు చేయలేదు. మరోవైపు.. వర్షాకాలం ప్రారంభమయ్యేందుకు నాలుగు నెలలే గడువుంది. అప్పటిలోగా అయినా గేటు ఏర్పాటు చేయాలని జలవనరుల నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే, 2009లో వచ్చిన భారీ వరదలు పోటెత్తితే డ్యాం భద్రతకే ముప్పు ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం, తుంగభద్ర బోర్డు అధికారులు స్పందించి గేట్ల ఏర్పాటుపై తక్షణ చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa