ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుంభమేళాలో మరోసారి ఆంక్షలు.. తెలుసుకోకుండా వెళ్తే తిప్పలు తప్పవు

national |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2025, 07:57 PM

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం అనేక మంది ప్రముఖులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. రేపటితో కుంభమేళా ముగుస్తుండగా.. భక్తుల సంఖ్య మరింత పెరిగింది. రేపే మహాశివరాత్రి పర్వదినం కావడం, అందులో కుంభమేళా చివరి రోజు కావడంతో.. అంతా స్నానాలు ఆచరించాలని చూస్తున్నారు. ఈక్రమంలోనే భక్తుల రద్దీ ఎక్కువ కాగా.. ప్రయాగ్‌రాజ్‌లో సీపీ కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికిల్ జోన్‌గా ప్రకటించారు. ఫిబ్రవరి 25వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆ నింబధనలు అమల్లోకి వస్తాయన్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


జనవరి 13వ తేదీన ప్రారంభం అయిన మహా కుంభమేళా రేపటితో ముగియబోతుంది. ఇప్పటికే 60 కోట్లకు పైగా భక్తులు ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వచ్చి గంగ, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరించగా.. చివరి రోజు మరింత ఎక్కువ మంది రాబోతున్నట్లు తెలుస్తోంది. రేపే చివరి రోజు కావడం.. అందులోనూ మహాశివరాత్రి వస్తుండడంతో భక్తులు ఎక్కువగా ప్రయాగ్‌రాజ్ చేరుకుంటున్నారు. ఈ విషయం గుర్తించిన యూపీ సర్కారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది.


ముఖ్యంగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్‌గా మారుస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఆంక్షలు ప్రయాగ్‌రాజ్‌ మొత్తం అమల్లో ఉంటాయని కూడా వివరించారు. స్థానికుల కోసం నిత్యావసరాలను తీసుకొచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తామని వెల్లడించారు. అంతేకాకుండా చివరి రోజు కుంభమేళాకు వచ్చే భక్తులు అందరికీ ఉచితంగా ఆహారం, వైద్య సదుపాయాలను అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు.


అయితే భక్తులు అందరూ.. అధికారులకు సహకరించాలని, ఎలాంటి సమస్యా ఉత్పన్నం కాకుండా ఉండాలంటే సమీపంగా ఉన్న ఘాట్ల వద్దే పుణ్య స్నానాలు ఆచరించాలని తెలిపారు. అలాగే కుంభమేళాకు వచ్చే రోడ్లన్నీ వాహనాలతో నిండిపోగా.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు 40 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయన్నారు. ప్రయాగ్‌రాజ్‌ను కలిపే మొత్తం 7 ప్రధాన రహదారుల్లో అదనపు డైరెక్టర్ జనరల్, ఇన్‌స్పెక్టర్ జనరల్ స్థాయి అధికారులు విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com