1984వ సంవత్సరంలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో ఓ ఇద్దరు తండ్రీ కొడుకులను సజీవదహనం చేశారు. అయితే ఈ కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ను ఇటీవలే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు దోషిగా తేల్చింది. ఈక్రమంలోనే నేడు మరోసారి విచారణ చేపట్టి అతడికి జీవితఖైదు శిక్షను విధించింది. ఇప్పటికే ఓ కేసులో జీవితఖైదు శిక్ష పడగా జైల్లో ఉన్నసజ్జన్ కుమార్పై మరో రెండు కేసులు కూడా ఉన్నాయి. మొత్తం నాలుగు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతడిని రెండు కేసుల్లో దోషిగా తేల్చారు. మరో రెండు కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఆ పూర్తి వివరాలు మీకోసం.
1984వ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆమెను చంపింది సిక్కు వ్యక్తి కాగా.. కాంగ్రెస్ కార్యకర్తలు, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మద్దతుదారులు అంతా ప్రతీకారంగా సిక్కులపై దాడులకు పాల్పడ్డారు. అనేక మందిని చంపేశారు. ఈక్రమంలోనే నవంబర్ 1వ తేదీన ఢిల్లీలోని సరస్వతీ విహార్ ప్రాంతంలో ఇద్దరు తండ్రీకొడుకులను సజీవ దహనం చేశారు.ముఖ్యంగా జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్ ఇంట్లో ఉండగా.. ఇంటిపై దాడి చేశారు. ఆపై ఇల్లును దోచేసి.. ఇంట్లో మనుషులను లాకే చేసి మరీ నిప్పు పెట్టారు. ఈ ఘటనలో తండ్రీకొడుకులు ఇద్దరూ సజీవ దహనం అయ్యారు.
అయితే ప్రమాద సమయంలో ఇంట్లో లేక ప్రాణాలతో బయటపడిన జస్వంత్ సింగ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ను అరెస్ట్ చేశారు. మొత్తం ఈయన నాలుగు కేసుల్లో నిందితుడిగా ఉండగా.. కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే ఓ కేసులో దోషిగా తేలగా.. ఇతడికి జీవితఖైదు శిక్ష పడింది. ప్రస్తుతం సజ్జన్ కుమార్ తిహాడ్ జైల్లో శిక్షను కూడా అనుభవిస్తున్నారు.
ఇదంతా ఇలా ఉండగా.. తండ్రీకుమారులు సజీవదహనం అయిన కేసుపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరుపుతోంది. ఫిబ్రవరి 12వ తేదీనే ఈ కేసులో ఆయన్ను దోషిగా తేల్చిన న్యాయస్థానం నేడు శిక్షను ఖరారు చేసింది. జీవితఖైదును విధిస్తూ అతడికి షాక్ ఇచ్చింది. జస్వంత్ ఇంటిపై దారుణానికి పాల్పడ్డ అల్లరిమూకలో.. సజ్జన్ కుమార్ కేవలం ఓ సభ్యుడు కాదని చెప్పింది. ఆయనే ఈ గ్రూపుకు నాయకత్వం వహించారని వివరించింది. అతడు చేసిన నేరానికి గరిష్ఠ శిక్ష అయిన మరణదండను విధించాలని.. కానీ ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్న అతడి సత్ప్రవర్తనను పరిగణలోకి తీసుకుని జీవితఖైదు విధిస్తున్నట్లు జస్టిస్ కావేరీ బవేజా వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa