తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు వోర్చి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. శ్రీవారి దర్శనం కోసం కిలోమీటర్ల దూరం నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటూ ఉంటోంది. దర్శనం దగ్గర నుంచి వసతి, అన్నప్రసాదాలు ఇలా ప్రతీ విషయాన్ని చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఇక తిరుమల శ్రీవారి భక్తుల ఆకలి తీర్చేందుకు తిరుమలలో నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే తిరుమలలో ఒకరోజు అన్నదానానికి ఎంత ఖర్చవుతుందనేదీ తెలుసా..
తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. శ్రీవారి దర్శనం దగ్గర నుంచి శ్రీవారికి సేవ చేసుకునే వరకూ వివిధ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంటుంది. స్వామి వారి సేవలో పాల్గొని తరించాలనుకునే భక్తులు చాలా మంది టీటీడీని సంప్రదిస్తూ ఉంటారు. అయితే తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా అన్న ప్రసాదం అందించాలనుకునే భక్తుల కోసం టీటీడీ ఓ పథకం అమలు చేస్తోంది. తిరుమలలో ఒక రోజు అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక రోజు విరాళ పథకం ప్రారంభించింది. తిరుమలలో ఒకరోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ చేయాలనుకునే భక్తులు రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని టీటీడీ తెలిపింది.
44 లక్షల రూపాయలు విరాళంగా అందిస్తే ఆ దాతల పేరు మీద ఒక రోజు శ్రీవారి భక్తులకు అన్న ప్రసాదాన్ని అందిస్తారు. ఇందులో ఉదయం అల్పాహారం కోసం రూ.10 లక్షలు, మధ్యాహ్నం భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు ఖర్చు చేయనున్నారు. అలాగే దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని కూడా టీటీడీ అందిస్తోంది.విరాళం అందించే దాతల పేర్లను కూడా ప్రదర్శిస్తారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో దాతల పేర్లను ప్రదర్శిస్తారు. తిరుమలలో అన్నప్రసాదం వితరణ చేయాలనుకునే భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, మరిన్ని వివరాలకు తమను సంప్రదించాలని టీటీడీ ఓ ప్రకటనలో కోరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa