ఏపీ విద్యా వ్యవస్థను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా బడ్జెట్లో విద్యా రంగానికి కేటాయింపులు జరిపింది. పాఠశాలల్లో మౌలిక వసతులను మరింత మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్ అందించనుంది. 2025- 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రూ.3.22 లక్షల కోట్లతో పయ్యావుల ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక బడ్జెట్లో విద్యారంగానికి కూడా భారీగా కేటాయింపులు జరిపారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్ అందించనున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గురించి ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్.. ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. "ఏపీలో పాఠశాల విద్యను దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించడం విప్లవాత్మకమైన నిర్ణయం. ఇది స్థానిక సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమేగాక ఉపాధ్యాయులు, విద్యార్థులపై ఒత్తిడి తగ్గిస్తుంది. సూపర్ – 6 హామీల్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభించడానికి బడ్జెట్లో నిధులు కేటాయించాం. రాష్ట్రంలో 1 నుంచి 12వ తరగతివరకు చదువుకునే ప్రతి విద్యార్థికి ఈ పథకాన్ని వర్తింపజేస్తాం" అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.
మరోవైపు 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పాఠశాల విద్యకు రూ.31,805 కోట్లు, ఉన్నత విద్యకు రూ.2,506 కోట్లు మొత్తంగా.. 34,311 కోట్లు కేటాయించినట్లు నారా లోకేష్ తెలిపారు. గతేడాది కేటాయింపుల కంటే ఇది రూ.2076 కోట్లు అధికమని నారా లోకేష్ పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో ఏపీ మోడల్ విద్యావ్యవస్థను తీసుకు రావాలన్న తన సంకల్పానికి బడ్జెట్లో కేటాయించిన నిధులు దన్నుగా నిలుస్తాయని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో ఏపీ యువత అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవకాశం కలుగుతుందంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్ అందించడం ద్వారా స్థానిక సంస్థలపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గించాలని ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa